హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల ముగిసిన వేళ డేటా చోరీ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఐటి గ్రిడ్స్ డేటా చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) ఆధార్ అథారిటీ నివేదికను అందజేసింది. సిట్ కోరిన వివరణ మేరకు సోమవారం ఆధార్ అథారిటీ ఈ నివేదికను ఇచ్చింది.
ఇప్పటికే డేటా చోరీపై మాదాపూర్ పిఎస్ లో ఆధార్ అధికారులు ఫిర్యాదు చేశారు. రెండు రాష్ట్రాలకు చెందిన డేటా చోరీ అయ్యిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
గత నెలలో మాదాపూర్ హైటెక్ సిటిలో ఉన్న ఐటి గ్రిడ్స్ కార్యాలయంపై తెలంగాణ పోలీసులు దాడి చేసి ఆంధ్ర ప్రాంత ప్రజలకు సంబంధించిన ఆధార్, ఓటరు లిస్ట్, బ్యాంక్ అకౌంట్ వివరాలు తదితర వ్యక్తిగత వివరాలు ఉండటాన్ని గమనించి కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ సంస్థ తెలుగుదేశం పార్టీకి చెందిన సేవామిత్ర యాప్కు సేవలు అందిస్తోంది. ఈ కేసు వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది.
ఈ సంస్థ కార్యాలయంలో ఆధార్ సమాచారం లభించడంతో అదెలా వచ్చిందో తెలియజేయాలని కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు వివరణ కోరుతూ ఢిల్లి లోని ఆధార్ కేంద్రం అధికారులకు లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన యూఐడిఏఐ అధికారులు హైదరాబాద్లోని ఆధార్ ప్రాంతీయ కార్యాలయం ద్వారా మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆధార్ కార్డు చట్టంలోని సెక్షన్ 37, 38, 40, 42, 44 కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఈ కేసును సిట్కు బదిలీ చేశారు.
మరోవైపు ఐటి గ్రిడ్ సంస్థ నుంచి స్వాధీనం చేసుకున్న కంప్యూటర్లు, హార్డ్ డిస్క్ లు, ఎలక్ట్రానిక్ వస్తువులను సిట్ అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా అధికారులు చర్యలు తీసుకోనున్నారు.
ఐటి గ్రిడ్స్ ఎండి ఆచూకీ ఇంత వరకూ లభ్యం కాలేదు. ఆయన కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. ఇప్పటికే మూడు సార్లు అశోక్కు నోటీసులు పంపినప్పటికీ ఆయన స్పందించలేదు. అశోక్ తో పాటు మరి కొందరిపై కేసు నమోదు చేసేందుకు సిట్ రంగం సిద్ధం చేస్తోంది.