Congress: ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గ అభిమానులతో బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళపల్లిలో ఇవేళ సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ .. త్వరలో వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అంటే తనకెంతో గౌరవమని అన్నారు. తన భావజాలానికి టీడీపీతో కలిసి ప్రయాణించలేకపోయానని అన్నారు.
వైసీపీ అధిష్టానంపైనా ఎటువంటి విమర్శలు చేయలేదు. వైసీపీ హైకమాండ్ తనకు సముచిత స్థానం ఇచ్చి పర్చూరు నుండి పోటీ చేయమని చెప్పిందన్నారు. అయితే కొద్ది రోజులు చీరాలలో సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు సేకరించగా, కాంగ్రెస్ పార్టీలో చేరాలని అభిమానులు సూచించారన్నారు. ఆటో గుర్తుతో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయాలని తాను అనుకున్నాననీ, అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఆటో గుర్తును రద్దు చేసిందని చెప్పారు. అందు వల్ల తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు పేర్కొన్నారు.
స్థానిక ఎమ్మెల్యే కరణం బలరాం, ఆయన తనయుడు వెంకటేష్ వైసీపీలో చేరాక చీరాలలో విధ్వంసం సృషించారని అన్నారు. కరణం కుటుంబీకులను చీరాల నుండి ఎప్పుడు పంపాలా అని నియోజకవర్గ ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. ఊరుకో ఏజెంట్ ను నియమించుకుని ఇసుక, రేషన్ దోపిడీ చేశారని ఆరోపించారు. తను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. అలానే క్యాడర్ కు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. చీరాల ప్రజల మద్దతుతో భారీ మెజార్టీతో ఘన విజయం సాధిస్తానన్న దీమాను ఆమంచి వ్యక్తం చేశారు.