(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: ఈ నెల 20న జరుగనున్న ఏపి అసెంబ్లీ సమావేశంలో ఎన్ఆర్సి, సిఎఎలను ఆంధ్రప్రదేశ్లో అమలు చేయమని ఏకగ్రీవంగా తీర్మానం చేయాలని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు లేఖలు రాశారు. ఎన్ఆర్సి, సిఎఎ, ఎన్పిఆర్లను రాష్ట్రంలో అమలు చేయబోమని కేరళ తరహాలో ఏపి అసెంబ్లీ తీర్మానం చేయాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాల వల్ల దేశ వ్యాప్తంగా ముస్లిం మైనార్టీలలో అభద్రతాభావం నెలకొన్నదని ఆయన అన్నారు. దీనిపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయన్న విషయాన్ని గుర్తు చేశారు. ఎన్ఆర్సి, సిఎఎలను వ్యతిరేకిస్తూ కేరళలో అమలు చేయబోమని అక్కడి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేశారని చెప్పారు.