నిజామాబాద్: సంక్రాంతి రోజున కేంద్రం నిజామాబాద్ ప్రాంత రైతులకు తీపి కబురు అందించింది. రైతుల ఆకాంక్షను పరిగణలోకి తీసుకున్న కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటుపై సానుకూల నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పసుపు ప్రమోషన్ హబ్ ఏర్పాటు చేయనుంది. దీనిపై త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఈ మేరకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు. రైతుల దశాబ్దాల కల నెరవేరబోతున్నట్లు అన్నారు. మున్సిపల్ ఎన్నికల కోడ్ కారణంగా పసుపు బోర్డు ప్రకటన వాయిదా పడిందని, జనవరి 25న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పసుపు బోర్డు ఏర్పాటు గురించి ప్రకటన చేస్తారని వెల్లడించారు. సంక్రాంతి రోజున పసుపు రైతుల స్వప్నం నెరవేరింనందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
‘తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పసుపు హబ్కు సంబంధించి నేడు చేయాల్సిన ప్రకటనను కేంద్ర మంత్రి పియూష్ గోయల్ జనవరి 25కి వాయిదా వేసుకున్నారని మీడియా వెల్లడించింది. నా రాష్ట్ర రైతాంగం పట్ల సహానుభూతితో ఉన్న భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు’ అని ఎంపీ అరవింద్ ట్వీట్ చేశారు.
Media reports that Announcement on Turmeric to be made today by Sh Piyush Goyal ji is postponed to beyond 25th January, due to election code in effect in Telangana.
I thank the government of India for being empathetic to farmers of my state.
— Arvind Dharmapuri (@Arvindharmapuri) January 15, 2020
*Invitation*
Hon’ble Union Minister for Commerce and Industries, Shri @PiyushGoyal ji will make a statement on Turmeric’s promotion today 2:50 p.m at oberoi hotel, lodhi estate, New Delhi. kindly cover.
Dharmapuri Arvind
MP, Nizamabd pic.twitter.com/SWkgXo0Olj— Arvind Dharmapuri (@Arvindharmapuri) January 15, 2020
నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పసుపు పంట బాగా పండుతుంది. దీంతో ఈ ప్రాంతంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ఆప్రాంత రైతులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. గతేడాది జరిగిన లోక్ సభ ఎన్నికల సందర్భంగా కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీజేపీనే కాబట్టి.. తనను గెలిపిస్తే పసుపు బోర్డును నిజామాబాద్లో ఏర్పాటు చేయిస్తానని ధర్మపురి అరవింద్ ప్రజలకు మాటిచ్చారు. ఒకవేళ తాను తీసుకురాలేకపోతే తన పదవికి రాజీనామా చేసి రైతులతో కలసి పోరాటం చేస్తానన్నారు. ఈ మేరకు బాండ్ పేపర్ మీద రాసి మరీ ఇచ్చారు. దీంతో సిట్టింగ్ ఎంపీగా ఉన్న కవితను ఓడించి మరీ అక్కడి ప్రజలు అరవింద్ని గెలిపించారు.
అయితే, బీజేపీ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచినప్పటికీ.. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు ప్రతిపాదన ముందుకెళ్లలేదు. ఓ దశలో పసుపు బోర్డు ఏర్పాటు కాదనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. దీంతో అరవింద్పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పసుపు రైతులకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రయత్నిస్తున్నామని, పసుపు రైతులకు బోర్డు కన్నా మంచి పరిష్కారం కోసం కేంద్రం నిర్ణయం తీసుకుందని గత డిసెంబర్ లో ఎంపీ అరవింద్ తెలిపారు. పసుపు రైతుల కోసం ప్రతి ఏడాది వంద కోట్ల నుంచి రెండు వందల కోట్ల రూపాయల నిధులు ఇవ్వనున్నట్టు చెప్పారు.
దీంతో ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన మాట మార్చారని, పసుపు బోర్డు సాధ్యం కాదని యూటర్న్ తీసుకున్నారని రైతులు ఆరోపించారు. అయితే, పసుపు బోర్డు ఏర్పాటు ఆవశ్యకత గురించి ఎంపీ అరవింద్ కేంద్రానికి వివరించినట్లు తెలుస్తోంది. దీంతో పసుపు బోర్డు సంబంధించిన ప్రకటన చేసేందుకు కేంద్రం సిద్ధమయినట్లు సమాచారం. అయితే మున్సిపల్ ఎన్నికల కోడ్ కారణంగా బుధవారం చేయాల్సిన ప్రకటనను వాయిదా పడింది. పసుపు బోర్డుపై జనవరి 25న కేంద్రం ప్రకటన చేయనుంది.
కాగా, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న వేళ.. కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం.