ప్రపంచ దేశాలని వణికిస్తోన్న కరోనా వైరస్ ను అరికట్టేందుకు శాస్త్రవేత్తలు చేస్తోన్న పరిశోధనల్లో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఆస్ట్రియా దేశంలో కరోనా కేసులు అత్యధికంగా ఉన్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు కరోనా ఎక్కువగా ఉన్న ఆయా ఆస్ట్రియా నగరాల్లోని కరోనా రోగుల నుంచి నమూనాలను సేకరించి ఆస్ట్రియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో పరిశోధించారు. ఈ పరిశోధనలో మరో కొత్త విషయం తెలిసింది.
కరోనా సోకిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా అతని నుంచి దాదాపుగా 1,000 వైరస్ కణాలు ఇంకొక వ్యక్తికి వ్యాపిస్తున్నాయని గుర్తించారు. సుమారు 750 మంది కరోనా రోగులను పరిశీలించి సాంపిల్స్ ని సేకరించిన తరువాత వారు వెల్లడించిన ఫలితాలివి. హెచ్ఐవీ, నోరో వైరస్ల కన్నా కరోనా రోగుల నుంచి వైరస్ కణాలు వేగంగా మరియు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయని చెబుతున్నారు. కరోనా సోకిన వారు తప్పనిసరిగా మాస్క్ ధరించి, ఇతరులకు భౌతిక దూరం పాటిస్తూ ఇంట్లో మంచి వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.