YS Sharmila: ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, ఆమె భర్త రామ్మోహన్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కడప జిల్లాలో ఇవేళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లోక్ సభ్య అభ్యర్ధిగా తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. షర్మిల బస్సు యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిల్లి కృపారాణి, రామ్మోహన్ రావు దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భం లో వారికి షర్మిల పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం కృపారాణి మాట్లాడుతూ..జగన్, వైసీపీ కోసం ఎంతో కష్టపడ్డానని చెప్పారు. ఉత్తరాంధ్రలో పార్టీని నిలబెట్టానని, అలాంటి తనను పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు వైఎస్ఆర్ అంటే దేవుడితో సమానమన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. షర్మిలలో వైఎస్ఆర్ ను చూస్తున్నామన్నారు. షర్మిల నాయకత్వంలో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ ఒక నియంత అని, ఆయనను గద్దె దించాలన్నారు. కడప ఎంపిగా షర్మిలకు అవకాశం కల్పించాలని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన కృపారాణి 2004 ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి నాటి టీడీపీ అభ్యర్ధి కింజరాపు ఎర్రన్నాయుడు చేతిలో పరాజయం పాలైయ్యారు. అయితే ఆ తర్వాత 2009 ఎన్నికల్లో ఎర్రంనాయుడుపై విజయం సాధించారు. తొలి సారి లోక్ సభకు ఎన్నికైనా కేంద్ర మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో కీలకంగా పని చేశారు. 2014 ఎన్నికల్లో అదే లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి పరాజయం పాలైయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ తుడిచిపెట్టుకుని పోవడంతో కృపారాణి 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు.
పార్టీలో చేరిన మరుసటి వైసీపీ జిల్లా అధ్యక్షురాలిగా కృపారాణికి అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. అయితే ఆమెకు లోక్ సభ స్థానాన్ని కేటాయించలేదు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తగిన ఆమెకు ప్రాధాన్యత దక్కలేదు. జిల్లా పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పించారు. ఈ సారి శ్రీకాకుళం లోక్ సభ స్థానం నుండి పోటీ చేయాలని భావించినా పార్టీ అధిష్టానం అవకాశం కల్పించలేదు. దీంతో పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న కృపారాణి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్దం అవుతున్నారు.
CM Ramesh: అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ పై కేసు నమోదు