అమరావతి: గోదావరికి మళ్లీ వరదలు వచ్చే అవకాశముందని రియల్ టైమ్ గవర్నెస్ సౌసైటి హెచ్చరించింది. ఈ రోజు నుండి మూడు రోజుల పాటు శబరి, ఇంద్రావతి, దిగువ గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపింది. భారీ వర్షాల కారణంగా గోదావరికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చే అవకాశముందని ఆర్టిజిఎస్ తెలిపింది. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ఇటీవల గోదావరి ఉప్పొంగి ప్రవహించిన సంగతి తెలిసిందే. లక్షలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. వందలాది కుటుంబాలు నిరాశ్రయిలుయ్యారు. పోలవరం ప్రాజెక్టు పరిధిలో పలు గిరిజన లంకలు జగదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇటీవలి వరద బీభత్సం నుండి తేరుకోకముందే మళ్లీ వరద హెచ్చరిక రావడంతో గోదావరి పరివాహక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.