ఈ టైటిల్ కాస్త విచిత్రంగా ఉన్నా ఇది నిజమే. మహేష్బాబు ఫ్యామిలీ టీడీపీతో తన అనుబంధాన్ని మరింత స్ట్రాంగ్గా కంటిన్యూ చేస్తూ వస్తోంది. టీడీపీ నుంచి 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు గుంటూరు ఎంపీగా గెలిచారు మహేష్బాబు బావ గల్లా జయదేవ్. అయితే రెండోసారి రాష్ట్రంలో ప్రభుత్వం మారాక జరిగిన పరిస్థితుల నేపథ్యంలో ఈ సారి ఎన్నికలకు దూరంగా ఉంటున్నానని.. పూర్తి టైం రాజకీయాలకు కేటాయించలేకపోవడంతో తాను రాజకీయాలకు విరామం తీసుకుంటున్నానని ప్రకటించేశారు.
ఇక్కడితో మహేష్బాబు ఫ్యామిలీ ఇక రాజకీయాలకు దూరంగా ఉంటుందా ? అన్న సందేహాలు కలిగాయి. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఈ విషయంలో సరికొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. సూపర్స్టార్ మహేష్బాబు బాబాయ్ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు టీడీపీ నుంచి అసెంబ్లీ టిక్కెట్ రేసులోకి వచ్చేశారు. వాస్తవానికి ఆదిశేషగిరిరావుకు ఎప్పటి నుంచో ప్రత్యక్ష రాజకీయాలపై బాగా ఆసక్తి ఉంది. 2014 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు. ఆ ఎన్నికల్లో ఆయన గుంటూరు ఎంపీ టిక్కెట్ ఆశించారు.
అప్పట్లో వైసీపీ రాష్ట్ర కార్యాలయం కోసం ఆదిశేషగిరిరావు మంగళగిరి సమీపంలో తెనాలి రోడ్లో ఉన్న తన స్థలాన్ని కూడా ఉచితంగా ఇచ్చారు. అయితే జగన్ ఆయనకు గుంటూరు ఎంపీ టిక్కెట్ ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆయన 2014 ఎన్నికలకు ముందే వైసీపీకి రిజైన్ చేసేశారు. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరారు. గత ఎన్నికలకు ముందు ఆయనకు వైసీపీ వాళ్లు అద్దంకి నుంచి అసెంబ్లీ సీటు ఆఫర్ చేశారని ఆయన కొద్ది రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
అయితే ఇప్పుడు ఆదిశేషగిరిరావు కన్ను కృష్ణా జిల్లాలోని పెనమలూరు సీటుపై పడినట్టు తెలుస్తోంది. చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు కూడా సినిమా రంగం నుంచి ముందుగా ఆయనే స్పందించారు. కొద్ది రోజులుగా రాజకీయాలపై ఆసక్తి కనపరుస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన గురువారం చంద్రబాబును కలిసి పెనమలూరు నుంచి పోటీకి ఆసక్తి కనపరచగా.. వెంటనే చంద్రబాబు కూడా ఓకే చెప్పినట్టు సమాచారం.
పెనమలూరు టీడీపీకి కంచుకోట. అయితే ఇప్పటికే అక్కడ టీడీపీ సీటు కోసం గట్టి పోటీ ఉంది. ప్రస్తుత ఇన్చార్జ్గా ఉన్న మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు మైలవరం నుంచి మాజీ మంత్రి దేవినేని ఉమాను ప్లేస్ మార్చి ఇక్కడ పోటీ చేయిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ టైంలో ఆదిశేషగిరిరావు ఇక్కడకు వస్తే బోడే ప్రసాద్, దేవినేని ఉమాల పొలిటికల్ ఫ్యూచర్ ఏంటో ఎవ్వరికి అర్థం కావడం లేదు. టీడీపీ అధినాయకత్వం ఆలోచన వేరుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆదిశేషగిరిరావు ఇక్కడ పోటీ చేస్తే మహేష్బాబు అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సపోర్ట్ చేస్తారన్న ఆశలు చంద్రబాబుకు ఉన్నాయి. అందుకే శేషగిరిరావు కోరిన వెంటనే బాబు ఆయన విషయంలో సానుకూలత వ్యక్తం చేశారని సమాచారం.