YSRCP: చాలా మంది రాజకీయ నాయకులకు పదవే పరమావధిగా ఉంటుంది. పదవి లేకపోతే క్షణం కూడా ఉండలేరు. ఉన్న పార్టీలో ఎమ్మెల్యే లేదా ఎంపీ దక్కకపోతే ఆ సిట్టింగ్ వెంటనే పక్క పార్టీకి జంప్ అయ్యే రోజులు ఇవి. ఎన్నికల సమయంలో జంపింగ్ జపాంగ్ లు అన్ని పార్టీల్లోనూ ఉంటారు. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ నుండి పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పార్టీలు మారారు.
టికెట్ రాని కొందరు మాత్రం ఇప్పటికీ అసంతృప్తితో ఉన్నారు. కొందరు హైకమాండ్ నుండి ఇచ్చిన హామీలతో పార్టీలో కొనసాగుతున్నారు. అయితే తను ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానానికి వేరే వ్యక్తికి ఇన్ చార్జిగా బాధ్యతలు అప్పగించినా ఏ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేయకుండా జగన్ పై నమ్మకంతో ఉన్నారు మంత్రి గుడివాడ అమరనాథ్. 2019 ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గం నుండి అమర్నాధ్ విజయం సాధించారు. జగన్ కేబినెట్ లో ప్రస్తుతం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అయితే అనకాపల్లికి పార్టీ అధిష్టానం ఇటీవల మలసాల భరత్ ను నియమించింది. ఆ తర్వాత మంత్రి గుడివాడ అమర్నాధ్ కు మరో నియోజకవర్గాన్ని కేటాయించలేదు. ఇటీవల జగన్ పాల్గొన్న సభలో అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘చాలా మంది నీ పరిస్థితి ఏమిటి..ఎక్కడ పోటీ చేస్తానని అడుగుతున్నారు.. నాకు 15 నియోజకవర్గాల బాధ్యతను సీఎం జగన్ అప్పగించారు. 15 నియోజకవర్గాలను గెలిపించి .. మళ్లీ జగన్ ను సీ ఎం చేసుకుంటాము. అవసరమైతే నేను పోటీ నుండి తప్పుకుంటా. అందరి తలరాతలు దేవుడు రాస్తాడు. నా తలరాత జగన్ మోహన్ రెడ్డి రాస్తారు’ అని గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలతో జగన్ పై మంత్రి అమర్నాధ్ ఎంత నమ్మకంతో ఉన్నారు అనేది అర్ధం అయ్యింది. అమర్నాధ్ భక్తికి మెచ్చిన జగన్ .. తాజాగా జాబితాలో ఆయనను గాజువాక ఇన్ చార్జిగా నియమించారు. ఇంతకు ముందు అక్కడ (గాజువాక) సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తనయుడు దేవన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉండగా, ఆయనను తప్పించి వరికూటి చందును ఇన్ చార్జిగా నియమించింది పార్టీ అధిష్టానం. ఇప్పుడు అమర్నాథ్ కోసం వరికూటి చందును పక్కన పెట్టారు సీఎం జగన్.
తాజా జాబితాలో చిలకలూరిపేట నియోజకవర్గానికి కొత్త ఇన్ చార్జిగా కావటి మనోహర్ నాయుడుని పార్టీ నియమించింది. ఇంతకు ముందు అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే విడదల రజినిని గుంటూరు కు పంపిన నేపథ్యంలో ఆమె స్థానంలో మల్లెల రాజేష్ నాయుడుని ఇన్ చార్జిగా నియమించారు. అయితే విడదల రజినికి రాజేష్ నాయుడికి మధ్య విభేదాలు రావడం, రజినిపై రాజేష్ నాయుడు ఆరోపణలు చేయడంతో పాటు పార్టీ అధిష్టానంపైనా అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేసిన నేపథ్యంలో రాజేష్ నాయుడును తప్పించి చిలకలూరిపేటకు కొత్త ఇన్ చార్జిగా కావటి మనోహర్ నాయుడుని నియమించారు.
PM Modi: ఏపీలో మోడీ పర్యటన ఖరారు .. చంద్రబాబుకు పీఎంఓ నుండి సమాచారం