YSRCP: దశాబ్దకాలంకుపైగా ఏ రాజకీయ పార్టీలో చేరకుండా దూరంగా ఉన్న మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు. ఆయన వైసీపీలో చేరికకు మూహూర్తం ఫిక్స్ అయ్యింది. 1978లో జనతా పార్టీ ఎమ్మెల్యేగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ముద్రగడ పద్మనాభం .. నాలుగు సార్లు శాసనసభ్యుడుగా, ఒక సారి పార్లమెంట్ సభ్యుడుగా గెలుపొందారు. టీడీపీ, కాంగ్రెస్ హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో పని చేశారు. 2009 ఎన్నికల్లో పిఠాపురం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత నుండి రాజకీయాలకు దూరంగా ఉన్నారు ముద్రగడ.
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కాపు ఉద్యమ నేతగా వ్యక్తిగత ఇమేజ్ ఉన్న ముద్రగడను పార్టీలో చేర్చుకుంటే అదనపు బలం అవుతుందని వైసీపీ, జనసేన భావించాయి. ఆ క్రమంలో కొద్ది రోజుల క్రితం ముద్రగడను వైసీపీ నేతలు, ఆ తర్వాత జనసేన, టీడీపీ నేతలు కలిశారు. అయితే తొలుత ఆయన జనసేనలో చేరేందుకు మొగ్గుచూపారు. వైసీపీ నేతలను తన ఇంటికి రావద్దని కూడా సూచించినట్లు వార్తలు వచ్చాయి.
అయితే పవన్ కళ్యాణ్ స్వయంగా కిర్లంపూడి వచ్చి పార్టీలోకి అహ్వానిస్తారని ఆ పార్టీ నేతలు ముద్రగడకు చెప్పగా అందుకు ఆయన అంగీకరించారు. కానీ రోజులు వారాలు గడుస్తున్నా పవన్ కళ్యాణ్ ముద్రగడ నివాసానికి రాలేదు. ఆహ్వానించలేదు. దీంతో ముద్రగడ హర్ట్ అయ్యారు. తన ఇంటి వద్దకు పవన్ రావాలంటే ఇతరుల అనుమతి అవసరమని పరోక్షంగా చంద్రబాబు గురించి ముద్రగడ ప్రస్తావించారు.
గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గ ఓటింగ్ పూర్తి స్థాయిలో జనసేన – టీడీపీ కూటమికి టర్న్ కాకుండా ముద్రగడ ద్వారా కట్టడి చేయవచ్చని వైసీపీ భావించింది. ఆ నేపథ్యంలో ముద్రగడ ఇంటికి వైసీపీ కీలక నేత, ఎంపీ మిథున్ రెడ్డి తదితర నేతలు వెళ్లి చర్చించారు. సీఎం జగన్మోహనరెడ్డి ప్రతినిధిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. పార్టీలో సముచిత గౌరవం లభిస్తుందని చెప్పారు. అనుచరులతో చర్చించి నిర్ణయాన్ని వెల్లడిస్తానని ముద్రగడ నాడు ఆయన తెలిపారు. వైసీపీలో చేరికకు సంబంధించి ఇవేళ నిర్ణయాన్ని ప్రకటించారు ముద్రగడ పద్మనాభం.
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల14న తన కుమారుడు గిరితో కలిసి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. తాను పార్టీలో చేరేందుకు వైసీపీని ఎలాంటి పదవులు అడగలేదని తెలిపారు. పార్టీ తనకు ఏ పదవి ఇచ్చినా సమర్ధవంతంగా నిర్వహిస్తానని, పార్టీలో చేరికకు ఎటువంటి కండీషన్లు పెట్టలేదనీ తెలిపారు. సీఎం వైఎస్ జగన్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ముద్రగడ వెల్లడించారు. ఈ నెల 14న కిర్లంపూడి నుండి తాడేపల్లికి భారీ ర్యాలీ నిర్వహించేందుకు ముద్రగడ అనుచరులు ప్లాన్ చేస్తున్నారు.
EC: కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా