ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత, చంద్రబాబు నాయుడు శనివారం టిడిపి ఎస్సీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతల గృహ నిర్బంధాన్ని ఖండించారు. టిడిపి నేతలు ఒత్తిడి చేయడం వల్లే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారని బాబు తెలిపారు. మృతుడి సెల్ఫోన్ లాక్కోవడం…. పరీక్షలు జరపడం…. హడావిడిగా అంత్యక్రియలు నిర్వహించడం వెనుక పెద్ద కుట్ర ఉందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అసలు ఇలా వ్యవహరించడం చాలా పెద్ద నేరం అని తప్పుబట్టారు.
చిత్తూరు జిల్లాలో జరిగిన దళితుడు ప్రతాప్ హత్యకు సంబంధించి ఆ కేసులో కీలకమైన మృతుడికి చెందిన కాల్ లిస్ట్ ను వెంటనే బయటపెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. చౌటుప్పల్ లో కూడా మరో యువకుడి ప్రాణాలు తీసి ట్రాక్టర్ బోల్తా పడి మరణించినట్లుగా చిత్రీకరించారని…. వార్తలు కూడా అందుకు తగ్గట్టుగా బయటకు వచ్చేలా అంతా కథలు అల్లారని చంద్రబాబు అన్నారు. చిత్తూరులో ఎస్సీల పై దమనకాండకు వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలే కారణం అని బాబు ఆరోపించడం గమనార్హం. అంతేకాకుండా జగన్ పాలనలో బాగా దళితులపై అరాచకాలు బాగ ఎక్కువైపోయాయి అన్న విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది.
ఇకపోతే రాష్ట్రంలో గత మూడు నెలల్లో దళితుడిపై రెండు శిరోముండనం ఘటనలు చోటుచేసుకోవడం మానవత్వానికి మాయని మచ్చ అని నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా సినీ నిర్మాత నూతన్ నాయుడు ఇంట్లో పనిచేస్తున్న అతనిపై ఇటు ఈ అమానుష ఘటన కు పాల్పడడం తెలిసిందే. ఈ ఘటనలకు, హత్యలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వాళ్లకు కొమ్ము కాయడమ్ మానేసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వారికి సైతం చట్టాలు అతీతం కాదని పరిగణించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.