విజయవాడ: దిశపై అఘాయిత్యానికి పాల్పడి, హత్యచేసిన వారు సామాన్యులు, ఎటువంటి రాజకీయ అండదండలు లేవు కాబట్టే తేలిగ్గా కాల్చి చంపేశారని అయేషా మీరా తల్లి శంషాద్బేగం అన్నారు. తన కుమార్తె విషయంలో ఇప్పటికీ ఎందుకు న్యాయం జరగడం లేదని ప్రశ్నించారు. సజ్జనార్ లాంటి అధికారి అయేషా కేసు దర్యాప్తును చేసి ఉంటే తమ బిడ్డకు న్యాయం జరిగేదని పేర్కొన్నారు. అత్యాచారాలు ఆగేలా ప్రత్యేక చట్టాలు తేవాలని ఆమె కోరారు.
బి ఫార్మసీ విద్యార్థి ఆయేషా మీరాపై పదేళ్ల క్రితం ఇబ్రహీంపట్నంలోని ఉమెన్స్ హాస్టల్లో అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నాడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించింది. ఈ కేసులో దోషిగా నిర్ధారించి శిక్ష పడిన పిడతల సత్యంబాబు అనే యువకుడిని హైకోర్టు నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసింది. అనంతరం ఈ కేసును ప్రభుత్వం గత ఏడాది నవంబర్లో సిబిఐకి బదిలీ చేసింది. ప్రస్తుతం సిబిఐ అధికారులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.