వచ్చే ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి కృష్ణాజిల్లాలోని నందిగామ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి ఖరారయ్యారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఇక్కడ నుంచి మరోసారి పోటీ చేయనున్నారు. సాధార ణం గా టికెట్ కోసం ప్రయత్నించడం నాయకులకు పరిపాటి. అయితే.. తంగిరాల విషయానికి వస్తే.. ఆమె స్వయంగా బిగ్ టార్గెట్ పెట్టుకున్నారు. దీనినే ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారు వచ్చే ఎన్నిక ల్లో తనను కాదు.. తన లక్ష్యాన్ని గెలిపించాలని కోరుతున్నారు.
ఇంతకీ సౌమ్య పెట్టుకున్న లక్ష్యం.. భారీ మెజారిటీ. అది కూడా 2014లో జరిగిన బైపోల్లో తనకు ప్రజలు ఇచ్చిన మెజారిటీని తిరిగి కట్టబెట్టాలని ఆమె విన్నవిస్తున్నారు. దీంతో ఆమె అనుచరులు, టీడీపీ నాయ కులు కూడా.. ఈ మెజారిటీ బోర్డును పట్టుకుని ఇంటింటికీ తిరుగుతున్నారు. తన అనుచరులు కూడా ఇదే విషయాన్ని ప్రచారంలోకి తీసుకువస్తారని ఆమె చెప్పిన వెంటనే.. కార్యాచరణకు పూనుకొన్నారు. టీడీపీకి కంచుకోట అయిన.. ఎస్సీ నియోజకవర్గం నందిగామలో ఈ పార్టీ వరుస విజయాలు దక్కించుకుంది.
1994 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికలలో టీడీపీ విజయం దక్కించుకుంది. రిజర్వ్డ్ కాకముందు.. దేవినేని ఉమా గెలుపుగుర్రం ఎక్కారు. 2009లో ఎస్సీ రిజర్వ్డ్ అయిన తర్వాత.. తంగిరాల ప్రభాకరరావు పోటీ చేశారు. వరుసగా 2009-2014 ఎన్నికల్లో ప్రభాకరరావు విజయందక్కించుకున్నారు. ఆయా ఎన్నికల్లో 5 వేల పైచిలుకు ఓట్లు మాత్రమే మెజారిటీగా దక్కించుకున్నారు. అయితే, 2014 ఎన్నికల తర్వాత.. ఆకస్మికంగా తంగిరాల మృతి చెందారు. దీంతో ఆయన కుమార్తె సౌమ్య అరంగేట్రం చేశారు.
2014లో వచ్చిన ఉప పోరులో ఆమె విజయం దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు 78,267 ఓట్ల మెజారిటీ వచ్చింది. గత ఎన్నికల్లో మాత్రం ఆమె పరాజయానికి చేరువైన విషయం తెలిసిందే అయితే. ఇప్పుడు మరోసారి ఆమె 2014లో తనకు వచ్చిన మెజారిటీని దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తనపై ఉన్న సింపతీ, మహిళా కోటా, ప్రభుత్వ వ్యతిరేకత, తాను ఎక్కడున్నా. ప్రజల సంక్షేమం కోసం, నియోజకవర్గం అభివృద్ధి కోసం తపిస్తున్న అంశాలు వంటివి ఆమెను ఈ దిశగా నడిపిస్తున్నాయి. మరి ఏమేరకు రీచ్ అవుతారనేది చూడాలి.