అమరావతి: బోటు ప్రమాదం వెనుక ఉన్న నిజాలు బయట పెట్టినందుకు దళిత నాయకుడు, మాజీ ఎంపి హర్షకుమార్ను కేసుల పేరుతో వేధిస్తారా అని టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి సిగ్గుగా లేదా అని లోకేష్ ప్రశ్నించారు. గోదావరిలో 144 సెక్షన్ పెట్టిన మేధావి వైఎస్ జగన్ బోట్ని తియ్యలేరా, ఇది చేతగాని దద్దమ్మ ప్రభుత్వం అనడానికి ఇంత కన్నా ఉదాహరణ ఏం కావాలని అని లోకేష్ విమర్శించారు.
బోటు ప్రమాదం వెనుక ఉన్న రహస్యం జలసమాధి చెయ్యాలి అని చూసినంత మాత్రాన నిజాలు దాగవని లోకేష్ అన్నారు. ఆ రోజు డ్యూటిలో ఉన్న ఎస్ఐకి ఫోన్ చేసి ఆపేసిన బోట్ని వదిలిపెట్టాలని ఒత్తిడి చేసిన వ్యక్తి పేరు బయటపెట్టాలని లోకేష్ అన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని లోకేష్ డిమాండ్ చేశారు.
గోదావరిలో ప్రమాదవశాత్తు మునిగిపోయిన బోటులో ప్రయాణించింది 73 మంది కాదనీ 93 మంది అని మాజీ ఎంపి హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అధికారులు ఉద్దేశపూర్వకంగా మృతదేహాలను బయటకు తీయకుండా తాత్సారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇందులో అధికారులు, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పాత్ర కూడా ఉందని హర్షకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. అయితే ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా హర్షకుమార్ ఆరోపణలు చేశారని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలనూ ఏర్పాటు చేశారు.
కాగా బోటు ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరుతూ హర్షకుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
గోదావరి బోట్ ప్రమాదం వెనుక ఉన్న నిజాలు బయట పెట్టినందుకు దళితనాయకుడు @gvharshakumar గారిని కేసుల పేరుతో వేధిస్తారా? ఈ ప్రభుత్వానికి సిగ్గుగా లేదా? గోదావరిలో 144 సెక్షన్ పెట్టిన మేధావి @ysjagan గారు బోట్ ని తియ్యలేడా? ఇది చేతగాని దద్దమ్మ ప్రభుత్వం అనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏంకావాలి?
— Lokesh Nara (@naralokesh) October 6, 2019