అంతర్వేది రథం దగ్ధం అయిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై అధికార- ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది.
తెలుగుదేశం పార్టీ సహా వివిధ పార్టీలు విమర్శలు చేసిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. అయితే, తాజాగా తెలుగుదేశం పార్టీ ఓ ట్విస్ట్ ఇచ్చింది. 2 నెలల్లో సీబీఐ విచారణ పూర్తిచేయాలని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అల్టిమేటం ఇవ్వడం గమనార్హం.
భక్తుల మనోభావాలు పట్టవా?
“తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో ప్రఖ్యాత శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయానికి చెందిన రథం 07-19-20వ తేదీ శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత కాలి బూడిదైంది. దీనిని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది. ఏటా రథోత్సవం రోజున ఈ రథాన్ని ఉపయోగిస్తారు. రూ.94 లక్షల ఖర్చుతో పూర్తి టేకు కలపతో ఈ రథాన్ని 57 ఏళ్ల క్రితం తయారు చేశారు. ఏటా రథోత్సవంపై స్వామివారి ఊరేగింపును తిలకించి భక్తులు తన్మయత్వం పొందుతారు. అదేవిధంగా అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. దేశ నలమూలల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తారు. అలాంటి దేవాలయం నిర్వహణ పట్ల ఉదాసీన వైఖరిని ప్రదర్శించడం ప్రభుత్వ విధానాలను తేటతెల్లం చేస్తోంది“ అని చినరాజప్ప మండిపడ్డారు.
ఏంటి ఇన్ని అబద్దాలు?
రథం దగ్ధమయిన ఘటనలో వాదనలు అనుమానాస్పదంగా మారాయని చినరాజప్ప పేర్కొన్నారు. “ఆలయానికి సమీపంలోని ప్రత్యేక షెడ్డులో రథాన్ని భద్రపరిచారు. అర్థరాత్రి సమయంలో రథం దగ్ధం కావడం బలమైన అనుమానాలకు తావిస్తోంది. దగ్ధానికి మొదట షార్ట్ సర్క్యూట్ అన్నారు. అక్కడ కరెంట్ కనెక్షనే లేదని తేలిన తర్వాత పిచ్చివాడి మీదకు నెట్టేశారు. అది కూడా తప్పని తేలిన తర్వాత తేనెతుట్టె మీదకు నెపం మోపారు. ఈ పరిణామంపై రాష్ట్రమంతా భగ్గుమన్నారు. ఇప్పుడు వేడి చల్లార్చడానికి అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు ప్రభుత్వం కోరతామంటున్నారు. ఇక్కడ ఒక్క అంతర్వేది కాదు.. ఇతర అన్ని ఆలయాలపైన, పూజారులపైన, సింహాచలం ఇసుక కుంభకోణం, ఆలయ భూముల కుంభకోణాలపైనా సీబీఐ విచారణ కోరాలి. “ అని చినరాజప్ప డిమాండ్ చేశారు.
16 నెలల్లో…
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 16 నెలల కాలంలో హిందూ దేవాలయాలపై జరిగిన విధ్వంస ఘటనలు, అక్రమాలపైనా సమగ్ర దర్యాప్తు జరిపించాలని చినరాజప్ప డిమాండ్ చేశారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. అంతర్వేది రథం దగ్ధం ఘటనపై న్యాయం చేయాలని డిమాండ్ చేసిన వారిపై నమోదు చేసిన కేసులను తక్షణమే ఉపసంహరించుకుని బేషరతుగా విడుదల చేయాలి. “అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ 2 నెలల్లో పూర్తిచేయాలి“ అంటూ సీబీఐకి టీడీపీ టీం అల్టిమేటం ఇవ్వడం గమనార్హం.