హైదరాబాద్: తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రియాంకారెడ్డి హత్య కేసులో ముగ్గురు పోలీసులు సస్పెండ్ అయ్యారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు నిజమని తేలడంతో శంషాబాద్ ఎస్సై రవికుమార్, హెడ్ కానిస్టేబుళ్లు వేణుగోపాల్ రెడ్డి, సత్య నారాయణ గౌడ్ లను సస్పెండ్ చేశారు. ప్రియాంక తల్లితండ్రులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్న ఆరోపణలతో ఈ వేటు పడింది.
ప్రియాంకారెడ్డి హత్య కేసులో ఆది నుంచి పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసులు స్పందించిన తీరుపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. తన కుమార్తె ప్రియాంక అదృశ్యం అయిందని, ఆమె తల్లిదండ్రులు నవంబర్ 27వ తేదీ రాత్రి శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కేసు నమోదు చేయకుండా కాలయాపన చేశారని ప్రియాంక తల్లిదండ్రులు ఆరోపించారు. ప్రియాంక సెల్ ఫోన్ స్విచ్చాఫ్ అవుతోందని, ఆమె ఆచూకీ తెలియడం లేదని శంషాబాద్ పోలీసులకు తొలుత ఫిర్యాదు అందగా, వారు స్పందించకుండా, ఆ ప్రాంతం తమ పరిధిలోకి రాదని చెప్పారు. పోలీసులు వెంటనే స్పందించి ఉంటే తమ బిడ్డ ప్రాణాలు పోయేవి కాదని ప్రియాంకారెడ్డి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపిన అధికారులు.. ముగ్గురిపై చర్యలు తీసుకున్నారు. ప్రియాంక తల్లిదండ్రులు ముందుగానే సమాచారం ఇచ్చినా, పోలీసులు స్పందించలేదని తేలడంతో తీవ్రంగా పరిగణించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ వారిపై చర్యలు తీసుకున్నారు. ఎవరైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.