టాలీవుడ్ లో గత కొన్నేళ్ళుగా ఏ సినిమా వచ్చినా దాని మీద కాపీ మరక అంటించడం కొంతమంది నెటిజన్స్ కి బాగా అలవాటైపోయింది. నెటిజన్సే కాదు కొంతమంది యాంటీ ఫ్యాన్స్ కి ఇదే పని. ఎప్పుడెప్పుడు తమ యాంటీ హీరో సినిమా కి సంబంధించిన అప్డేట్ వస్తుందా.. ఎప్పుడెప్పుడు ఏదో ఒక వంక పెట్టి రచ్చ చేసి ఏకేద్దామా అని చూస్తుంటారు. ముఖ్యంగా మెగా హీరోల మీద ..వాళ్ళ సినిమాల మీద బాగా ఎక్కువగా ఇలా రచ్చ చేయడం ఒక హ్యాబిట్ గా అయిపోయింది.
ఇప్పుడు ఆచార్య, పుష్ప సినిమాలపై వస్తున్న కాపీ ఆరోపణలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ”ఆచార్య” సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ ని చూసిన కన్నెగంటి అనిల్ కృష్ణ అనే రచయిత.. ఈ స్టోరీ నా కథను పోలి ఉందని.. మోషన్ పోస్టర్ లో ఉన్న ‘ధర్మస్థలి’ అనే ఎపిసోడ్ నేను రచించిన ‘పుణ్యభూమి’ అనే రచన నుంచి తీసుకున్నారని ఆరోపించారు. ఇదే క్రమంలో ‘ఆచార్య’ కథ తనదేనంటూ బి గోపాల్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన రాజేష్ మండూరి అనే వ్యక్తి ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వెంటనే స్పందించిన ‘ఆచార్య’ నిర్మాతలు, చిత్ర దర్శకుడు కొరటాల శివ తాజాగా క్లారిటీ ఇచ్చారు. అయితే ఇది మొదటిసారి కాదు. మెగా హీరోల సినిమాలపైనే ముందు నుంచి ఇలాంటి ఆరోపణలు ఎక్కువగా వస్తున్నవే. గతంలోను రామ్ చరణ్ నటించిన ‘మగధీర’ సినిమా మీద కాపీ ఆరోపణలు వచ్చాయి. అలానే మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ నెం.150’ పై కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. అంతేకాదు చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ విషయంలో కూడా ఇలాంటి కాపీ వివాదమే తలెత్తింది.
ఇవే కాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ”అల వైకుంఠపురములో” సినిమాకి కూడా కాపీ మరకలు అంటించారు. ఓల్డ్ మూవీ ఇంటి గుట్టు అన్న కథ నే త్రివిక్రం మళ్ళీ తీశాడని ఒక టాక్ రాగా .. మరొక దర్శక రచయిత నా కథ నే కాపి కొట్టారని త్రివిక్రం మీద ఫైర్ అయ్యాడు. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమాపై కాపీ ఆరోపణలు మొదలయ్యాయి. అయితే ఎప్పుడు మెగా ఫ్యామిలీ హీరోల సినిమా మొదలైనా ఇలా కాపీ మరకలు అంటుకోవడం ఏంటో అని ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు.