1970 దశకం మొదట్లో “కల్- ఆజ్- ఔర్ కల్” అనే సినిమా వచ్చింది. అంటే, అర్థం “నిన్న-నేడు-రేపు” అని. అది మూడు తరాల కథ. ఈ సినిమా వచ్చి ఇప్పటికి దాదాపు అర్ధశతాబ్ది కావస్తోంది. కాలం గురించి ఆలోచించినప్పుడల్లా ఈ కథే గుర్తుకు వస్తూ ఉంటుంది. నిన్న నేడు రేపు అనుకోవడమే కానీ, ప్రపంచం ఎల్లప్పుడూ బతికేది నేడులోనే . అటు కాలంలో కలిసిపోయిన- లేదా కలవబోతున్న- నిన్నతోనూ, ఇటు భవిష్యత్తును ప్రభావితం చెయ్యబోయే రేపటితోనూ సర్దుకు బతికేది నేడే! తరాల అంతరం విషయంలో ఇదెంత నిజమో, రాజకీయాల్లోనూ అంతే నిజం.
అయినా, నిన్న-నేడు-రేపు అంటూ కృత్రిమంగా మనం చేసుకునే విభజనే కానీ, కాలానికి గతమేమిటి? ఆగతమేమిటి? అంతా ఒకే తానులో ముక్కలు కదా! భవిష్యత్తు వర్తమానంగా మారిపోవడానికి ఒక్క క్షణం చాలు! ఆ వర్తమానం గతంగా మారడానికి రెప్పపాటు చాలు! ఈ రెప్పపాటు ప్రయాణం గురించి ఎందుకింత హడావిడి అనిపించక పోదు. ముఖ్యంగా, ఎన్నికల్లో మనకి ఇష్టం లేని వ్యక్తులో శక్తులో విజయం సాధించినప్పుడు ఈ ఆధ్యాత్మిక, తాత్విక భావాలు తలెత్తుతూ ఉంటాయి. నిజం చెప్పాలంటే ఈ ఎన్నికల వైరాగ్యం కూడా రెప్పపాటు వుండి, పోతుంది. నిజమైన జీవన స్ఫూర్తి ఈ నిత్యనైమిత్తికాల కన్నా ఎంతో గొప్పది; మరెంతో విలువైనది! అవునుమరి- వాస్తవం కన్నా విలువైంది ఏముంటుంది?
ఇటీవల ముగిసిన ఎన్నికల్లో వ్యక్తమయిన ప్రధాన ధోరణులు రెండింటి గురించి మాటాడుకోనట్లయితే, ఇదంతా కేవలం కాలక్షేపం కబుర్లతో సమానం అయిపోతుంది. ఈ రెండు పోకడల్లో ఒకటి సానుకూలమైన ధోరణి కాగా మరొకటి అందుకు విరుద్ధమైనది. మరీ ముఖ్యంగా, ఈ రెండు ధోరణుల్లో ఒకటి మన రాష్ట్రంలోనే వ్యక్తమయిన పోకడ కాగా, రెండోది మనకి తరతరాలుగా సాంస్కృతిక స్ఫూర్తినిస్తున్న బెంగాల్లో జరిగింది. మరీ అంత ఘనమైన విషయం కాకపోయినప్పటికీ, సానుకూల ధోరణి వ్యక్తమయింది మన రాష్ట్రంలోనే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ పోలింగ్ జరగడానికి ముందు రోజు నేను సతీ సమేతంగా మా మిత్రుడు ఒకతని ఇంటికి వెళ్ళా. నా మిత్రుడు అన్న తర్వాత అతగాడికి సహజంగానే రాజకీయాలంటే ఆసక్తి -నా మాదిరిగానే – ఉండితీరాలి కదా! అంచేత, మర్నాడు జరగబోయే పోలింగ్ పోకడల గురించి కొంతసేపు మాటాడుకున్న తర్వాత, మా అందరి అభిప్రాయాలు ఒకేలా ఉన్నాయని తేలిపోయింది. ఆ దశలో మిత్రుడి భార్యామణి ఓ చిత్రమైన విషయం చెప్పారు. ఆమె చెల్లెలు ఒకామె గోదావరి జిల్లాలో ఓ మారుమూల పల్లెలో ఉంటారట. ఆవిడకి చంద్రబాబు సర్కారు రకరకాల పేర్లతో పదివేల రూపాయలు ఆ రోజే ముట్టచెప్పిందట. సదరు సొమ్ముతో మాంచి ఫ్రిజ్జు కొనుక్కోవాలన్నది సదరు చెల్లెమ్మ కోరిక. ఏ కంపెనీ ఫ్రిజ్జు కొనాలో కనుక్కునేందుకే ఆమె అక్కగారికి -అప్పుడే- ఫోన్ చేసి ఉన్నారట. సరే- ఫలానా కంపెనీ ఫ్రిజ్జు కొనుక్కోమని చెప్పిన మీదట, “చెల్లెమ్మా, చెల్లెమ్మా, నీ ఓటు ఎవరికమ్మా?” అని మా మిత్రుడి సతీమణి అడిగారట. “ఇంకెవరికి- జగను బాబుకే!” అని చెల్లెమ్మ చెప్పిందట. “పది వేలిచ్చింది సీఎం బాబు కదా? వోట్ మాత్రం జగను బాబుకా?” అని అక్కగారు అడిగిందట. “అయినా, ఆ పదివేల కోసం మీదుకట్టుకుని కూచున్నామా మేము? ఏనాడో డిసైడ్మెంట్ అయిపోయిందక్కా! నాకు తెలకడుగుతాను, ఆ రూపాయలు సీఎం జేబులోంచి ఇచ్చాడా? మం సొమ్ము మనకివ్వడమూ ఘనకార్యమేనా?” అని అడిగిందట ఆ చెల్లెమ్మ.
పేరు తెలియని ఆ చెల్లెమ్మ నా కన్నా పెద్దదో, చిన్నదో తెలీదు కానీ ఆమెకి చేతులెత్తి మొక్కుతున్నా! సీఎం బాబు అధికార యంత్రాంగం సాయంతో పోలింగ్ రేపనగానూ, మరి కొద్దీ సేపట్లో మొదలవుతుందనగానూ, పసుపూ కుంకాలు పేరిట వందల కోట్ల రూపాయలు పంచిపెట్టారు. రాంగోపాల్ వర్మ అన్నట్లుగా తెలుగాడ పడుచులు పసుపూ కుంకాలు పుచ్చుకుని, ఉప్పు కారం పూశారు సీఎం కి! ఎందుకంటే, ఆయన పంచేసొమ్ము తమదేనని వాళ్లకి తెలిసినందువల్ల.
కొత్త ముఖ్యమంత్రి ఈ వాస్తవాన్ని గుర్తించకపోతే, చరిత్ర పునరావృత్తం అవుతుంది!
పొతే, బెంగాల్ పరిణామం గురించి కూడా మాటాడుకోవలసి వుంది- మూడు దశాబ్దాలపాటు ఆ రాష్ట్రాన్ని ఏలిన సీపీఎం, మన దేశం లోని ఏకైక కేడర్ బేస్డ్ పార్టీ. ఆ పార్టీకి వెన్నెముకగా ఉన్న ఆ కేడర్ ఈ ఎన్నికల్లో ఎరుపు రంగును కాషాయ వర్ణంగా మార్చుకుని, బీజేపీకి పట్టంకట్టారు. ఇలాంటి పరిణామాలు కేరళలో కూడా జరిగాయని పత్రికలు అంటున్నాయి. కమ్యూనిస్ట్ పార్టీల కార్యకర్తల్ని ఆ పార్టీల నాయకులు నియంత్రించలేకపోవడం ప్రముఖంగా ప్రస్తావించుకో వలసిన విషయం. అధికారం ఎండమావిని తరుముకుంటూ పోయే “పార్లమెంటాలిటీ” మిగిల్చే ఫలితాలు మరోలా ఎందుకుంటాయి?
రేపు కేరళలో అసెంబ్లీ ఎన్నికల సవాలు ఎదుర్కొనే నాటికైనా ఈ నడమంత్రపు నేతాజీలు పగ్గాలు బిగించి పట్టుకోగలరా? చూద్దాం!
– మందలపర్తి కిషోర్
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ