వెనకటికి ఒక రాజుగారు వన సంచారం చేస్తూ రాణి గారి స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చారట. పట్టపు రాణి కెరటాల మీద ఉయ్యాలలూగుతూ జలకాలాడుతోంది. సరసమాడాలని బుద్ధి పుట్టింది రాజా వారికి. ఇంకేముంది రాజు తలుచుకుంటే దేనికైనా కొదవేముంది? రాజును చూసి చెలికత్తెలు ఎప్పుడో పారిపోయి వుంటారు. చేత్తో జలకాలు తీసుకుని హృదయేశ్వరి మొహం మీద చిలకరించాడట. ఆ రాణి గారు కాస్తోకూస్తో భాషా సాహిత్యాల పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. వెంటనే తన భాషా చమత్కారాన్ని చూపించాలని మోదకేన తాడయామి అందట. మా అంటే వద్దని. ఉదకం అంటే నీరు. తాడయామి అంటే కొట్టడం. మా ఉదకేన తాడయామి.. నీటితో కొట్టొద్దు అని ఆమె అంతరార్థం. పాపం మన రాజుగారికి అంత జ్ఞానం లేదు మరి. మోదకములు అంటే లడ్డూలు. ఓహో లడ్డూలతో కొట్టమంటోందా అని వెంటనే ఎవరక్కడ అని అరవడం లడ్లు రావడం రాజావారు రాణిగారి మీద విసరడం క్షణాల్లో జరిగిపోయింది. రాజు తలుచుకుంటే దేనికి మాత్రం కొదవ చెప్పండి?
ఈ కథ ఇప్పుడెందుకు గుర్తుకొచ్చిందంటే కాలాలు మారినా పాలకుల జ్ఞాన సంపద ఇసుమంత పెరగలేదని అనిపించడమే. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో అతి సుదీర్ఘంగా జరిగిన ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. ఎవరు రాజో ఎవరు బంటో తేలడానికి ఇంకా కొద్దిరోజులే మిగిలాయి. ఎవరొచ్చినా ఒరగబెట్టేది ఏముందిలే అని అనుకున్నా ప్రస్తుత ప్రభుత్వ పనితీరు పట్ల కొంతైనా మూల్యాంకనం చేసుకోవడం తప్పదు కదా. అన్ని రంగాలలో మనవారు ఏం వెలగబెట్టారో ఇప్పుడు చెప్పుకోవలసిన పనిలేదు. నన్ను కలవరపరిచిన అంశం ఒకటే. ప్రమాదంలో పడిన శాస్త్ర విజ్ఞాన రంగమే అది. దేశంలో ఇప్పటిదాకా ఏర్పడ్డ ప్రభుత్వాల్లో సైన్స్ వ్యతిరేక ప్రభుత్వంగా ఇప్పటి పాలక బృందానికి అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించవచ్చు. ఈ బృందానికి నాయకుడైన ప్రధాన మంత్రే తన సైంటిఫిక్ టెంపర్మెంట్ ని అనేకసార్లు ప్రపంచానికి చూపించి ఆహా ఓహో అనిపించుకున్నారు. ప్లాస్టిక్ సర్జరీ మనకు ఎప్పుడో పురాణ కాలంలో వుందని ఆయన వినాయకుణ్ణి చూపించినప్పుడు దేశవిదేశీ శాస్త్రవేత్తలు దిమ్మతిరిగి మూర్ఛపోయారు. తాజాగా ఆయన ప్రదర్శించిన సైన్స్ పరిజ్ఞానం అవధులు లేని అతని మేధో సామ్రాజ్యానికి పరాకాష్ట. యుద్ధ విమానాలు మబ్బుల ముసుగేసుకుని దూసుకుపోతే రాడార్ల వల నుంచి తప్పించుకోవచ్చని మోదీగారి ఉవాచ. బాలాకోట్ ఉదంతం వెనక తన వ్యూహ రచనలోని మర్మాన్ని ఇటీవలనే ఆయన వివరించారు. శాస్త్రసాంకేతిక నిపుణులతో సహా అంతా నివ్వెరపోయారు. ఇంటర్నెట్, ఈమెయిల్స్, డిజిటల్ టెక్నాలజీ అందుబాటులోకి రాక మునుపే ఆయన వినియోగించారట. ఏ వేద విజ్ఞాన భాండాగారం నుండి ఆయన ఎరువు తెచ్చుకున్నారో మనకు తెలీదు కాని బడి పిల్లలు కూడా ముక్కు మీద వేలేసుకున్నారన్న విషయం ఆయనకు తెలుసో లేదో మరి. సాక్షాత్తు ప్రభువు ఇలా వుంటే మరి ఆయన అనుచర గణం ఎలా ఉంటారో ఊహించడానికి పెద్ద శాస్త్రపరిశోధనా నైపుణ్యాలేం కావాలి చెప్పండి.
రాజు తన తెలివితేటలకు తగిన వారినే తన అనుయాయులుగా నియమించుకోవడం తరుచుగా జరిగేదే. దేశంలో విజ్ఞానం వెల్లివిరిసేలా చేసేవి యూనివర్సిటీలు..ఇతర విద్యాసంస్థలు. అవి అన్నీ హెచ్.ఆర్.డి. శాఖ కింద ఉంటాయి. వాటికి ఏమాత్రం ఉన్నత విద్యార్హతలు లేని ఇద్దరు మంత్రులను నియమించిన ఖ్యాతి మన ప్రధానికే దక్కుతుంది. ఇక వారు నియమించిన వైస్ ఛాన్సలర్ల గురించి చెప్పుకుంటే చాలా వుంది. అందరూ కాషాయం తాను ముక్కలే కాబట్టి అందరి జ్ఞానం ఒకే వృత్తంలో గిర్రున తిరుగుతూ వుంటుంది. వారి హయాంలో యూనివర్సిటీల్లో చెలరేగిన అలజడులు మనకు తెలిసినవే. సమస్త విద్యాసంస్థలను నిర్వీర్యం చేసిన ఘనత వీరికే దక్కాలి. ప్రధాని నియమించిన సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిని ఉదాహరణగా తీసుకుంటే మొత్తం ఎలాంటి పాలనా దక్షుల జ్ఞానవృక్షాల కింద మన దేశం ఈ అయిదేళ్ళూ తలదాచుకుందో అర్థం చేసుకోవచ్చు. ఐన్ స్టీన్ సిద్ధాంతంతో సహా మొత్తం ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అంతా మన వేదాల నుంచి వచ్చిందే అని సదరు మంత్రి మహాశయులవారు సెలవిచ్చారు. అక్కడా ఇక్కడా కాదు, ఏకంగా ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లో మంత్రిగా తన వేద పరిజ్ఞానాన్ని ప్రదర్శించారు. అసలు కౌరవపాండవుల కాలం నుంచే మనకు స్టెమ్ సెల్, టెస్ట్ ట్యూబ్ బేబీ టెక్నాలజీ వుందని ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అదే కాంగ్రెస్ లో ప్రపంచానికి చాటి చెప్పారు. ఇదీ మన ఏలికలు మన పిల్లలకు నేర్పించిన, నేర్పించాలని చూసిన విద్య. ఏ ప్రమాణాలను మనం నెలకొల్పాలనుకుంటున్నాం? ఎవరిని ప్రోత్సహిస్తున్నాం? ఎవరిని అణచివేస్తున్నాం? ఇలాంటి ప్రశ్నలు వేసుకోవలసిన వారే చీకటిలో కొట్టిమిట్టాడుతుంటే ఇంకెవరిని ఏమనగలం? అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏం మాట్లాడుతున్నాడో చూస్తున్నాం. ఆయన జ్ఞానపరిమితులేమిటో తెలిసి తరిస్తున్నాం. టెర్రరిస్టుగా ముద్రపడిన వ్యక్తులనే ఎన్నికల బరిలో దింపడంతో జాతికి వీరు ఇస్తున్న సందేశం ఏమిటో అర్థం చేసుకుంటున్నాం. ఆవు మూత్రంతో క్యాన్సర్ తగ్గిపోతుందని మెడికల్ టెక్నాలజీనే సవాలు చేసిన ప్రజ్ఞా ఠాకూర్ ప్రజ్ఞా పాటవాలు చూశాం. ఇప్పుడేకంగా గాడ్సేని గొప్ప దేశభక్తుడుగా కీర్తించి ఆమె తన దేశభక్తిని చాటిచెప్పిన తీరును చూసి దేశం ఉలిక్కిపడింది. వీరంతా తమ నాయకుడితో పాటు దేశాన్ని ఎన్ని యుగాలు వెనక్కి నడిపించారో తలచుకుంటే బాధే మిగులుతుంది.
ఇలాంటి నేతృత్వాన్ని మన దేశం ఇంతకు ముందెప్పడైనా చూసిందా అంటే లేదనే ఖచ్చితంగా జవాబొస్తుంది. నెహ్రూ కాలం నుండి ఇప్పటి వరకూ ఎప్పుడూ దేశంలో శాస్త్ర సాంకేతిక రంగాలను ఇంత దారుణంగా ఎద్దేవా చేసిన వారిని చూడలేదు. వాజ్ పేయి నాయకత్వంలో మొదటి ఎన్.డి.ఏ.ప్రభుత్వాన్ని ఇప్పుడు గుర్తు చేసుకోవాలి. వారూ వీరూ వచ్చిన నేపథ్యం ఒకటే అయినా వాజ్ పేయి నాయకత్వం ఉన్నత విద్యాప్రమాణాలకు పెద్ద పీట వేసిన విషయం మరిచిపోలేం. మొదటి ఎన్డీయే ప్రభుత్వంలోని హెచ్.ఆర్.డి. మంత్రి మురళీమనోషర్ జోహి ఫిజిక్స్ లో పీహెచ్.డీ పొందిన వారు. జార్జి ఫెర్నాండెజ్, యశ్వంత్ సిన్హా, ఎల్.కె.అద్వానీ లాంటి అతిరథ మహారథులు వాజ్ పేయి మంత్రివర్గంలో ఉన్నారు. పుస్తకాలు నిరంతరం చదివే వారే కాదు, పుస్తకాలు రచించిన మేధావులెందరో ఆనాటి ప్రభుత్వంలో ఉన్నారు. ఈనాటి మంత్రివర్గ సభ్యుల్లో ఒకరైనా ఎప్పుడైనా కనీసం పుస్తకం చదివేవారున్నారా? న్యూస్ పేపర్లు, ఫేస్ బుక్ లు, ట్విటర్లు తప్ప పఠన జ్ఞానం ఏ ఒక్కరికైనా ఉందా అని చరిత్రకారుడు రామచంద్ర గుహ సందేహాన్ని వ్యక్తం చేశారంటే ఆయన సందేహాన్ని సందేహించే పనేలేదని చెప్పొచ్చు.
లక్షల మెదళ్ళను కదిలించే అక్షరాన్నే నిషేధిస్తారు. మెదళ్ళను మొద్దుబార్చే విషాన్ని అక్షరంలోకి ఎక్కిస్తారు. సరిహద్దులు లేని జ్ఞానం కోసం సాగే ఆలోచనలనే నిరోధిస్తారు. మనుషుల మధ్య హద్దులు గీసే కుంచిత బుద్ధులనే ప్రోత్సహిస్తారు. వీధి బడి నుండి విశ్వవిద్యాలయం వరకూ విశ్వమానవ ప్రేమే పరిమళంగా వికసించాల్సిన జ్ఞాన పుష్పాలే కొలమానంగా అడుగులు ముందుకు పడాలి. మనలోని అజ్ఞానమే దేశానికి దిక్సూచి అనుకుంటే చివరికి మిగిలేది అంధకారమే. ఎవరు గెలుస్తారు..ఎవరు ఓటమి పాలవుతారన్నది కాదు. ఎవరు దేశాన్ని విద్వేషాగ్నుల నుండి కాపాడి.. విజ్ఞాన వనాల వైపు నడిపిస్తారో వారే అసలు సిసలు నేతలు. గురజాడ మాటలొకసారి గుర్తు తెచ్చుకుందాం.
మతములన్నియు మాసిపోవును
జ్ఞానమొక్కటె నిలిచి వెలుగును
డా.ప్రసాదమూర్తి
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ