దశాబ్దాలుగా నలుగుతూ వచ్చిన రామజన్మభూమి – బాబరీ మసీదు వివాదం కేసులో సుప్రీంకోర్టు శనివారం ఇచ్చిన తీర్పుపై మహాత్ముడి మునిమనుమడు తుషార్ గాంధీ ఎలా స్పందించారో తెలుసా? ‘మహాత్ముడి హత్యకు నాధూరాం గాడ్సేను సుప్రీంకోర్టు ఈరోజు విచారిస్తే, గాడ్సే హంతకుడే, అయితే దేశభక్తుడు కూడా అంటూ తీర్పు చెబుతుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.
అయోధ్యలో బాబరీ మసీదును 1992లో నేలమట్టం చేసిన ఘటనను సుప్రీంకోర్టు ధర్మాసనం తన 1045 పేజీల తీర్పులో ప్రస్తావించింది. తప్పు జరిగితే దాన్ని సరిదిద్దాలి అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ‘చట్టబద్ధ పాలనకు కట్టుబడిఉన్న సెక్యులర్ దేశంలో చేపట్టకూడని పద్ధతుల్లో ముస్లింలకు లేకుండా చేసిన మసీదు గురించి పట్టించుకోకపోతే న్యాయం జరిగినట్లు కాదు’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
అదే సుప్రీంకోర్టు ధర్మాసనం వివాదస్థలం మొత్తాన్నీ ‘రామలల్లా విరాజ్మాన్’కు అప్పగించింది. ఒక పక్క నేరం జరిగిందంటూనే మరోపక్క దాని వల్ల తమ హక్కులు కోల్పోయిన వారికి ఆ హక్కులు నిరాకరించడం ఈ తీర్పు ప్రత్యేకత. అందుకే తుషార్ గాంధీ అలా స్పందించారు.
16 శతాబ్దంలో అయోధ్యలో నిర్మించిన బాబరీ మసీదు అక్కడ నిలిచి ఉన్నంతవరకూ ముస్లింలకు దానిపై హక్కులు ఉన్నాయి. బాబరీ మసీదును కూల్చివేసిన తర్వాత కూడా వారికి ఆ హక్కులు కొనసాగాయి. చివరికి సుప్రీంకోర్టు ఈ తీర్పుతో వారికి ఆ హక్కులు లేకుండా చేసింది. అందుకోసం ధర్మాసనం అటు వాస్తవాలపై కానీ, ఇటు కాలపరీక్షకు నిలబడిన న్యాయసూత్రాలపై కానీ ఆధారపడలేదు. ఎవరి మతపరమైన నమ్మికలు వారికి ఉంటాయంటూనే మెజారిటీవాదం నమ్మికపై ఆధారపడింది. నమ్మిక ఆధారంగా తీర్పు చెప్పలేమంటూనే రామజన్మభూమి అనే నమ్మికకు చట్టబద్ధత కల్పించింది. చిత్రం ఏమంటే ఈ తీర్పులోనే మసీదు నిర్మాణానికి మందిరాన్ని కూల్చినట్లు ఎక్కడా ఆధారాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది.
బాబరీ మసీదు అక్కడ నిలచిఉండడమే తమ హక్కులకు ఆధారమని ముస్లిం పక్షాలు సుప్రీంకోర్టులో వాదించాయి. మితవాద హిందూ సంస్థలు 1949లో చాటుగా రామ్లల్లా విగ్రహాలను బాబరీ మసీదు అంతర్భాగంలోకి తీసుకువెళ్లి ప్రతిష్టించేవరకూ ముస్లింలు అక్కడ ప్రార్ధనలు చేస్తూనే ఉన్నారు. ఈ సంఘటన తర్వాత శాంతిభద్రతల పేరుతో వారిని లోపలకు వెళ్లకుండా చేశారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు కూడా తీర్పులో అంగీకరించింది. మొఘలాయిల పాలనలో కూడా అక్కడ ముస్లింలు, హిందువులు గొడవలు లేకుండా ప్రార్ధనలు చేసుకున్నారని ధర్మాసనం పేర్కొన్నది.
ఇన్ని చెప్పిన సుప్రీంకోర్టు మరి ముస్లింలకు హక్కు లేదని ఎందుకు తీర్పు చెప్పినట్లు? ముస్లిం పక్షాలు వాదించినట్లు దాదాపు 500 ఏళ్ల నాటి ఆ ముస్లిం కట్టడం అక్కడ ఉండడమే వారి హక్కులకు ఆధారం. సుప్రీంకోర్టు తీర్పులో ప్రముఖంగా పేర్కొన్నట్లుగా వారికి లేకుండాపోయిన కట్టడం గురించి పట్టించుకోదలిస్తే వారికే హక్కులు ఉన్నట్లు ప్రకటించాలి. అది ఎవరికైనా తోచే సహజన్యాయం. అలా కాకుండా చట్టం, న్యాయం పక్కనపెట్టి దేశ విశాలహితం కోసం వివాదాన్ని శాశ్వతంగా ముగించదలిచినా అలహాబాద్ హైకోర్టు తీర్పులో పేర్కొన్నట్లు వివాదస్థలాన్ని ఇరుపక్షాలకూ పంచాలి. ఈ రెండు మార్గాలనూ సుప్రీంకోర్టు పట్టించుకోలేదు. పంపకానికయితే సుప్రీంకోర్టు ధర్మాసనం ససేమిరా అన్నది. ఎట్టి పరిస్థితుల్లో పంపకం కుదరదన్నది. అంత గట్టిగా ఎందుకు కుదరదన్నది మాత్రం న్యాయసూత్రాల ప్రాతిపదికగా చెప్పలేకపోయింది.
వివాదస్థలం హిందువులకు చెందుతుందన్న దానికి సుప్రీంకోర్టు చూపించిన సమర్ధనీయత ఈ విధంగా ఉంది: 1949 డిసెంబర్ 22, 23 తేదీల్లో రామ్లల్లా విగ్రహాలను గోప్యంగా లోపలకు చేరవేసినపుడు బాబరీ మసీదు ముస్లింల స్వాధీనం నుంచి తప్పింది. ఆఖరుకు 1992 డిసెంబర్ 6న దానిని నేలమట్టం చేసినపుడు అది స్థిరమయింది. ఇప్పుడు అది ఎవరి స్వాధీనంలో ఉందన్నదానిపై ఆధారపడి రామ్లల్లాకు 2.77 ఎకరాల వివాదస్థలం అప్పగించవచ్చు. ఈ అప్పగింతకు వీలుగా రామలల్లాను సుప్రీంకోర్టు కక్షిదారుగా గుర్తించింది.
ముందు చెప్పినట్లు, 1949 డిసెంబర్ నాటి విగ్రహాల చేరవేత, 1992 డిసెంబర్ నాటి మసీదు నేలమట్టం..ఈ రెండు చర్యలూ చట్ట ఉల్లంఘననేని సుప్రీంకోర్టు ఇదే తీర్పులో ప్రకటించింది. అంటే రెండు సార్లు చట్టాన్ని ఉల్లంఘించి ఒక వివాదస్థలాన్ని హిందువులు తమ స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి సుప్రీంకోర్టు చట్టబద్ధత కల్పించింది. వారు కూల్చివేయకపోతే ఆ కట్టడం అక్కడే ఉండేది కదా అన్న వాస్తవాన్ని సుప్రీంకోర్టు తల్లకిందులుగా అన్వయించి హిందువులకు హక్కు కల్పించింది. తుషార్ గాంధీ అన్నట్లు న్యాయసూత్రాలకు ఒక కొత్త సూత్రం వచ్చి చేరింది. అదేమంటే నమ్మికతో కూడిన నేరం.
-ఆలపాటి సురేశ్ కుమార్