ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు రేపిన చిచ్చు తెలిసిందే. ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ మళ్లీ ఆ పదవిలో కూర్చునే వరకూ సాగిన ఆ ఎపిసోడ్ మొత్తానికి చల్లారింది. అయితే.. ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలైతే జరగవు అనే స్పష్టత అందరికీ వచ్చింది. కానీ.. రీసెంట్ గా సోషల్ మీడియాలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిందని.. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ అంటూ ఓ వార్త వాట్సాప్ లో హల్ చల్ చేసింది. నిమ్మగడ్డ ఈసీగా ఉండగా ఎన్నికలకు వెళ్లడం అంత మంచిది కాదనే అభిప్రాయం వైసీపీ వ్యక్తం చేస్తోంది. సుప్రీంకోర్టులో ఇందుకు సంబంధించి కేసు పెండింగ్ లో ఉంది. మొత్తంగా ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశం లేదు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏమంటుందంటే..
నిన్న సోషల్ మీడియాలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసిందంటూ ఓ వార్త హల్ చల్ చేసింది. దీంతో మీడియా వర్గాల్లో, ప్రజల్లో కాస్త అలజడి రేగింది. ఇంత అకస్మాత్తుగా ఎన్నికలు ఏంటీ.. నిజమెంత అని ఆలోచించేలోపే ఈసీ స్పందించింది. ఇది పూర్తిగా నిరాధారమైన వార్తగా తేల్చింది. గతంలో ఈసీ ఇచ్చిన సందేశాన్ని మార్చి కొందరు సృష్టించి అబద్దపు షెడ్యూల్ అంటూ కొట్టిపారేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టులో పలు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇవి తేలే వరకూ ఎన్నికలు జరిగే అవకాశమే లేదు.. అని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈసీ కూడా ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలపై ఆలోచనే చేయడం లేదు.
ప్రభుత్వం కూడా ఇప్పట్లో ఎన్నికలకు వెళ్లకపోవచ్చు..
స్థానిక సంస్థల ఎన్నికల నడివిని ప్రభుత్వం తగ్గించింది. సర్పంచ్ ఎన్నికలు 13 రోజుల్లో, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు 15 రోజుల్లో జరిగేలా ఆర్డినెన్స్ ఇచ్చింది. ఈ ఆర్డినెన్స్ చట్టంగా మారలేదు. ఆమధ్య ప్రభుత్వం రెండోసారి మళ్లీ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఇలా రెండుసార్లు ఒకే అంశంపై ఆర్డినెన్స్ తెచ్చేందుకు వీలు లేదని.. ఒకసారి ఆర్డినెన్స్ వీగిపోయాక ఆ అంశం మరుగునపడినట్టే అని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలు లేవని అంటున్నారు.