దేశంలో అనాధలుగా మిగిలిపోయిన పిల్లలు ఎందరో ఉన్నారు. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన శిశువులు చెత్త కుప్పల్లో పడి అనాధలవుతున్న వారి సంఖ్యకు లెక్కే లేదు. వీరిని ఆదుకునేందుకు దేశంలో ఎన్నో సేవా సంస్థలు ఉన్నాయి. చదువు, ఆహారం, ఆరోగ్యం, వసతి.. సదుపాయాలు కల్పించే ఎన్జీవో సంస్థలకు కొదవ లేదు. అటువంటి చిన్నారులపై జాలి, అక్కున చేర్చుకున్న ఎన్జీవో సంస్థలపై గౌరవం పెరుగుతాయి. మన వంతుగా సాయం చేయాలనే ఆలోచనా వస్తుంది. విరాళాలూ వస్తాయి. అయితే.. దీనిక వెనుక అక్రమాలు జరుగుతున్నాయని.. తెలుగు రాష్ట్రాలే తొలి రెండు స్థానాల్లో ఉన్నాయని జాతీయ బాలల హక్కుల కమిషన్ గణాంకాలే చెప్తే.. ఆ సంస్థలపై కోపం తెచ్చుకోవాలా.. తలదించుకుని సిగ్గు పడాలా..?
వచ్చేది ఇంత.. ఖర్చ పెట్టేది అంతా..?
అనాధల కోసం విరాళాలివ్వండి.. వారిని ఆదుకోండి.. అంటూ ఎన్నో ఎన్జీవో సంస్థలను చూస్తూంటాం. దేశ విదేశాల నుంచి కూడా విరివిగా విరాళాలు వస్తూంటాయి. పిల్లల కోసం.. అని దాతలు వారి కోసం విరాళాలు ఇస్తుంటే.. వాటిని వీరు స్వలాభంతో జేబుల్లోకి మళ్లించుకుంటున్నారు. జాతీయ బాలల హక్కుల కమిషన్ లెక్కల ప్రకారం ఒక్క ఏపీలోనే ఒక్కో చిన్నారి కోసం ఏటా 6లక్షల 60వేలు విరాళంగా వస్తోంది. కానీ.. ఈ సంస్థలు వారి కోసం ఖర్చు చేస్తోంది కేవలం 60వేల లోపే. జాతీయ గణాంకాలే ఇలా చెప్తుంటే.. ఎవరిని నమ్మాలి అనే ప్రశ్న వస్తుంది. చిన్నారులను చూపించి కొందరు అక్రమార్కులు చేస్తున్న ఈ వ్యవహారం ఓ దందాగా మారిపోయిందనడంలో అతిశయోక్తి లేదు. చిన్నారుల కోసం వీరేం చేస్తున్నారనే ప్రశ్నా రాక మానదు.
తెలుగు రాష్ట్రాలదే టాప్ పొజిషన్..
దేశంలోని 5 రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన బాలల హక్కుల కమిషన్ ఈ నివేదక ఇచ్చింది. ఈ అక్రమాల్లో ఏపీ నెంబర్ వన్ గా నిలవడం సిగ్గు పడాల్సిన విషయం. తర్వాతి స్థానాల్లో వరుసగా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ దందా కొనసాగిస్తున్నాయి. సంస్థలపై నమ్మకంతో ఇస్తున్న విరాళాలు ఇలా సొంత ఖాతాల్లోకి మళ్లించుకోవడం దుర్మార్గం. ఈ అక్రమాలు సాయం చేసేవారి ఆలోచనలను మార్చేస్తాయి. అది చిన్నారుల భవిష్యత్తుకు మంచిది కాదు. ఈ మొత్తం చిన్నారుల జీవితాలకు బాటలు వేయాలి కానీ.. అక్రమార్కుల జేబులు నిండడం కోసం కాదు. ఈ అక్రమాల నిగ్గు తేల్చి దాతలకు నమ్మకం కలిగించాల్సిన బాధ్యత బాలల హక్కుల కమిషన్ దే.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?