రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలని చూస్తున్న బిజెపి అమ్ములపొది లోంచి ఒక పెద్ద అస్త్రం బయటకు వచ్చింది. అగ్రవర్ణాలలోని పేదలకు విద్యా రంగంలో, ప్రభుత్వ ఉద్యోగాలలో పది శాతం రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించింది. ఇటీవలి అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో బిజెపి పరాజయం పాలయిన మీదట మోదీ – అమిత్ షా ద్వయం మేజిక్ పని చేయడం మానేసిందన్న భావన నెలకొంటున్న తరుణంలో మోదీ ప్రభుత్వం ఈ ప్రతిపాదనతో బయటకొచ్చింది.
అగ్రవర్ణాలలో పేదలకు రిజర్వేషన్ కల్పించాలంటే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దానికి అవరోధంగా మారుతుంది. అన్ని కేటగిరీలకూ కలిపి మొత్తం మీద రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు ఒక కేసులో తీర్పు చెప్పింది. ఈ అడ్డంకి నుంచి తప్పుకోవాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనకే సోమవారం కేంద్ర మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజ్యాంగం లోని ఆర్టికల్ 15, 16 కు సవరణ ప్రతిపాదిస్తూ మంగళవారం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టనున్నారు.
ఎన్నికలలో పరాజయానికి ఎవరెన్ని భాష్యాలు చెప్పినా అధికారపక్షం ప్రభ ఎంతో కొంత తగ్గిందని చెప్పక తప్పదు. ఒక పక్క రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు రఫేల్ స్కామ్పై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. మరోపక్క రైతుల దుస్థితిపై దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొని ఉన్నది. ప్రతిపక్షాలు ఈ పరిస్థితిని సహజంగానే తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ఇప్పటికే హమీ ఇచ్చింది.
నిజానికి ప్రతిపక్షాలకు రుణమాఫీ అస్త్రం లేకుండా చేసేందుకు మోదీ ప్రభుత్వమే భారీ రుణమాఫీ ప్రకటించవచ్చన్న ఊహాగానాలు వినబడ్డాయి. అయితే ఆశ్చర్యకరంగా మోదీ దాని జోలికి వెళ్లలేదు. పైగా రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ రైతులను మోసం చేస్తోందని ఆయన విమర్శిస్తున్నారు. అంటే బిజెపి ఇకమీదట కూడా ఆ ఎత్తుగడ వేసే అవకాశం లేదు.
ఇప్పుడు మోదీ సర్కారు ప్రకటించిన అగ్రవర్ణాలకు రిజర్వేషన్ ప్రతిపాదన బిజెపికి సైద్దాంతిక మార్గదర్శి అయిన ఆరెస్సెస్ ఆలోచనలకు అనుగుణమైన చర్య. రిజర్వేషన్లు అమలు చేయడం మొదలుపెట్టి ఎన్ని దశాబ్దాలు గడచినా ఆశించిన ప్రతిఫలం ఉండడం లేదన్న భావన ఇటీవలి కాలంలో పెరుగుతోంది. ఎస్సి, ఎస్టిలకు ఇంకెన్నాళ్లు రిజర్వేషన్లు కొనసాగిస్తారన్న ప్రశ్న వేళ్లూనుకుంటోంది. ఆ మద్య ఆరెస్సెస్ అగ్ర నాయకుడు ఎస్సి, ఎస్టి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడి నాలుక కరుచుకున్నారు కూడా. నిరుద్యోగం ప్రబలిపోయి యవతలో అశాంతి నెలకొంటున్న తరుణంలో జాట్, పటేల్, మరాఠా వంటి వర్గాల నుంచి కూడా రిజర్వేషన్ కోసం ఉద్యమాలు మొదలయ్యాయి.
ఈ సమస్యలన్నిటికీ అగ్రవర్ణాలకు జనరల్ కేటరిగీలో రిజర్వేషన్ కల్పించడం పరిష్కారం చూపుతుందని బిజెపి నాయకత్వం భావిస్తోంది. ఈ దెబ్బతో ప్రతిపక్షాలపై పైచేయి సాధించవచ్చని బిజెపి నాయకత్వం భావిస్తున్నట్లు కనబడుతోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?