హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్ధృతమవుతోంది. ఎనిమిదో రోజు కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనతో హోరెత్తించారు. పలు చోట్ల మౌన ప్రదర్శన చేశారు. ఇటు ప్రభుత్వం, అటు కార్మికులు పట్టువీడకపోవడంతో సమ్మె కొనసాగుతోంది. శుక్రవారం ఆర్టీసీ జేఏసీతో కలిసి బీజేపీ నేతలు బస్ భవన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ కల్యాణ మండపం నుంచి భస్ భవన్ వరకు బీజేపీ శ్రేణులు, ఆర్టీసీ జేఏసీ నాయకులు ర్యాలీగా బస్ భవన్కు చేరుకుని అక్కడ బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ ఆయన ఆందోళనకు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు అడ్డుకుకోవడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. దీంతో బస్ భవన్ ఎదుట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సొమ్మసిల్లి పడిపోయారు. అనంతరం ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసి నారాయణగూడ పీఎస్కు తరలించారు. లక్ష్మణ్కు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఫోన్ చేసి పరామర్శించారు.
మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయని అధికారులు చెబుతున్నప్పటికీ గంటలకొలది ప్రయాణీకులు ఎదురుచూడాల్సి వస్తోంది. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.