అమరావతి, జనవరి30: ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ రా ష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ను అఖిలపక్ష నేతలతో ఫిబ్రవరి 12 న కలవనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వచ్చేనెల ఒకటవ తేదీనుంచి 13 వరకు ప్రత్యేక హోదా, విభజన హామీ తదితర అంశాలపై నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు.
ప్రత్యేక హోదా, విభజన హామీలు అనే అంశంపై ముఖ్యమంత్రి బుధవారం సచివాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ, జనసేన, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, వామపక్ష పార్టీలు హాజరు కాలేదు. ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్,బిఎస్సీ, ఎస్సీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఉద్యోగ సంఘాల నేతలు సమావేశంలో పాల్గొన్నారు. 12 వ తేదీన ముఖ్యమంత్రితో పాటు ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలిసేందుకు కూడా ప్రధాన రాజకీయపార్టీలు సిద్ధంగా లేవని తెలిసిపోతూనే ఉంది.
ప్రత్యేక హోదా విషయంలో కలిసికట్టుగా పోరాడేందుకు రాజకీయ పార్టీలు సిద్ధంగా లేవనీ, ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారికి దాని కన్నా ప్రధానమనీ ఈ రోజు ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం మరోసారి తేటతెల్లం చేసింది.
నిజానికి ప్రతిపక్షాలు తమ వైఖరిని నిన్ననే స్పష్టం చేశాయి. సరైన ఎజెండా లేకుండా నిర్వహించే మొక్కుబడి సమావేశాలకు దూరంగా ఉంటామని జనసేన అధినేత పవన్కళ్యాణ్ ముఖ్యమంత్రికి లేఖ ద్వారా తెలిపారు. ఒక్కరోజు ముందు సమావేశానికి ఆహ్వానిస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు.
అఖిలపక్షం పేరుతో ముఖ్యమంత్రి కొత్త డ్రామా ఆడుతున్నారని వైసిపి నేత పేర్ని నాని ఆరోపించారు. ప్రజలు గగ్గోలు పెడతారని సమావేశం నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు.
ప్రచార ఆర్భాటం కోసంమే అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారని భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ ఆరోపించారు.
అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లమంటే ముఖ్యమంత్రి స్పందించలేదని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. సమావేశానికి రమ్మని పార్టీ అధ్యక్షుడికి ఆహ్వానం పంపకుండా కార్యదర్శి జంగా గౌతమ్కు పంపడం సరికాదని ఆయన తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.