అమరావతి: ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్లు కలుస్తారని ఎవరైనా ఊహించగలరా ? విభిన్న దృవాలైన వీరు కలవడం సాధ్యమేనా ?. ఈ భిన్న దృవాలు దేశం కోసం ఏకం కావాల్సిన అవసరం ఉందని సిపిఐ నేత నారాయణ అభిప్రాయపడుతున్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశానికి లౌకిక విధానాలతో కూడిన ఫ్రంట్ అవసరమనీ దీని కోసం వీరు ముగ్గురూ చేతులు కలపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోది ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని నారాయణ అన్నారు. మే 23 తరువాత మోదికి పంగనామాలే మిగులుతాయని నారాయణ ఎద్దేవా చేశారు.
చాయ్ వాలా అని చెప్పుకునే మోది మేకప్ కోసం నెలకు 80లక్షలు ఖర్చులు చేస్తున్నారని నారాయణ విమర్శించారు.
సుప్రీంకోర్టు, సిబిఐ, ఆర్బిఐ, ఇడి వంటి స్వయం ప్రతిపత్తి సంస్థలను నడిరోడ్డుపై బట్టలు లేకుండా కేంద్రం నిలబెట్టిందని నారాయణ దుయ్యబట్టారు.
పుల్వామా ఉగ్రదాడిలో భారీ సంఖ్యలో జవాన్లు మృతి చెందడానికి కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని నారాయణ
ఆరోపించారు. ఇంటెలిజెన్స్ హెచ్చరికలు అందినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని నారాయణ అన్నారు.
తెలంగాణాలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు కెసిఆర్ ప్రభుత్వం బాధ్యత వహించాలనీ, విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని నారాయణ డిమాండ్ చేశారు.
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన, మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలు సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ ఎన్నికల్లో పోటీకే అనర్హురాలని నారాయణ అన్నారు.