ఆంధ్రప్రదేశ్ లో కొంతకాలంగా సద్దుమణిగిన టీడీపీ-బిజెపిల మాటల యుద్దం మళ్లీ రాజుకుంది. ఎపిలో బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా పర్యటన తో మళ్లీ ఈ రెండు పార్టీలు పరస్పరం మాటల తూటాలతో దాడి చేసుకుంటున్నాయి. ఎపి టూర్ లో భాగంగా ఉత్తరాంధ్ర విచ్చేసిన అమిత్ షా తన పర్యటన ఆద్యంతం చోటుచేసుకున్న గందరగోళంతో ఖంగుతిన్నట్లు తెలుస్తోంది. పలాసలో అమిత్ షా నిర్వహించిన సభ వద్ద టీడీపీ శ్రేణులు ఆందోళనలు,నిరసలకు దిగడం…అందుకు ప్రతిగా అమిత్ షాకు మద్దతుగా బీజేపీ శ్రేణులు కూడా ప్రదర్శనకు దిగడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది.
ఈ నేపథ్యంలో టిడిపి నేతలు అమిత్ షా దిష్టిబొమ్మను దగ్దం చేసేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అదే సమయంలో టీడీపీ కార్యకర్తల నిరసనకు మద్దతుగా పలాస ఎమ్మెల్యే గౌతు శివాజీ, శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షురాలు శిరీష రంగంలోకి దిగడంతో వీరి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహం దగ్గర బైఠాయించాయి. వీరిని అక్కడ నుంచి పంపించేందుకు పోలీసులు ఎంత నచ్చచెప్పినా వినకపోవడంతో గౌతు శివాజీని, శిరీషను అరెస్ట్ చేసి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా వారిని టీడీపీ శ్రేణులు అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. ఇలా ఆద్యంతం నిరసనలు,ఆందోళనల మధ్యే బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఎపి పర్యటన కొనసాగింది.
ఇదంతా ఒకెత్తయితే అమిత్ షా తన తాజా పర్యటన సందర్బంగా చేసిన ప్రసంగం,సవాళ్లు చర్చనీయాంశంగా మారాయి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా ఏపీ అభివృద్ధికి ఎంతగానో సహకరిస్తుంటే…చంద్రబాబు అబద్దాలు చెబుతూ దుష్ప్రచారం చేస్తున్నారని అమిత్ షా ధ్వజమెత్తారు. తెలంగాణ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన చంద్రబాబు ఆ తరువాత మహాకూటమి అంటూ మరో పల్లవి ఎత్తుకున్నారని, ఎపికి తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీతో నిస్సిగ్గుగా కలసిపోయారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
గతంలో కాంగ్రెస్ పది సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది కేవలం లక్షా 72 వేల కోట్లు మాత్రమేనని, కానీ తమ బిజెపి బీజేపీ ప్రభుత్వం గడచిన నాలుగేళ్లలో రూ. 5.56 లక్షల కోట్లు ఇచ్చిందని అమిత్ షా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా నిరుపేదలకు 2 కోట్ల ఇళ్లను కేంద్రం మంజూరు చేస్తే అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే 10 లక్షల ఇళ్లు కేటాయించిందని, 20 జాతీయ స్థాయి సంస్థలను నెలకొల్పడం జరిగిందన్నారు. ఎపికి తాము ఇచ్చిన 14 హామీల్లో ఇప్పటికే 10 అమలు చేసేశామని. ఇలా ఎపికి తామెంతో సాయం చేస్తే…కేంద్రం ఏమీ సాయం చేయలేదంటూ చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఏపికి తాము చేసిన సాయంపై చర్చకు చంద్రబాబు సిద్ధమా?…అంటూ అమిత్ షా సవాల్ విసిరారు.
మరోవైపు అమిత్ షా సవాల్ ను టిడిపి స్వీకరించింది. చర్చకు తాము సిద్దమని, సమయం,స్థలం అమిత్ షా చెప్పినా సరే అని…తాము ఎప్పుడైనా చర్చకు సిద్దమేనని వారు ప్రతిస్పందించారు. అయితే ఈ నేపథ్యంలో అమిత్ షా సవాల్ హాట్ టాపిక్ గా మారింది. గతంలోనూ ఎపి పర్యటన సందర్భంగా అమిత్ షా తాము ఎపికి లక్షల కోట్లు సాయం చేసినట్లు ఊదరగొట్టగా…తదనంతరం టిడిపి అవన్నీ వట్టి ప్రకటనలు, హామీలేనని నిజానికి రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది అత్యల్పమేనని ఆధారాలతో సహా ఖండించడం జరిగింది.
అయితే ఆ విషయమై అప్పుడు అమిత్ షా గాని, ఇతర బిజెపి నేతలు గాని ఎవరూ నోరు మెదపలేదు. అలాంటిది మళ్లీ ఇంతకాలం తరువాత మరోసారి ఎపికి వచ్చిన అమిత్ షా ఈసారి కూడా గతంలో లాగానే మళ్లీ కేంద్రం లక్షల కోట్లు సాయం చేసిందంటూ ప్రకటించడంపై అటు టిడిపి నేతలే కాదు ఇటు రాజకీయ పరిశీలకులు కూడా ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. సాయం చేయలేదని తెలిసి కూడా అమిత్ షా బహిరంగసభల్లోనూ అంత నిర్భీతిగా ఎలా మాట్లాడగలుగుతున్నారని, వాస్తవాలు తెలిసిన ప్రజలు వారిని ఈసడించుకుంటారనే భావన లేకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరి అమిత్ షా అంత పబ్లిక్ గా బుకాయింపులకు దిగడం వెనుక పరమార్థం ఏమిటో బిజెపికే తెలియాలని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?