అమరావతి, మార్చి 25: అనంతపురం జిల్లా హిందూపూర్ పార్లమెంట్ వైసిపి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మాజీ పోలీస్ ఇన్స్పెక్టర్ గోరంట్ల మాధవ్కు హైకోర్టుల ఊరట లభించింది.
ట్రిబ్యునల్ తీర్పును హైకోర్టు సమర్ధించింది.
తాను స్వచ్చంద పదవీ విరమణ చేసినా రాజకీయ కక్షసాధింపు చర్యతో రిలీవ్ చేయడం లేదంటూ గోరంట్ల మాధవ్ హైకోర్టును ఆశ్రయించారు.
రెండు చార్జి మెమోలపై శాఖాపరమైన చర్యలు పెండింగ్లో ఉన్నందున రిలీవ్ ఆర్డర్స్ ఇవ్వలేదంటూ పోలీస్ అధికారులు కోర్టుకు విన్నవించారు.
వాదప్రతివాదనలు విన్నమీదట హైకోర్టు మాధవ్ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసుకోవచ్చని పేర్కొంది. ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సమర్థించింది.
తొలుత మాధవ్ ట్రిబ్యునల్ను ఆశ్రయించగా అతని నామినేషన్ను స్వీకరించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. విఆర్ఎస్ కోసం మాధవ్ పెట్టుకున్న దరఖాస్తును వెంటనే ఆమోదించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ కారణాలతో విఆర్ఎస్ను ఆమోదించకపోవడం సరికాదని కూడా వ్యాఖ్యానించింది.
ట్రిబ్యునల్ తీర్పుపై కూడా పోలీస్ అధికారులు స్పందించకపోవడంతో మాధవ్ హైకోర్టును ఆశ్రయించగా సోమవారం అనుకూలంగా తీర్పు వెలువడింది.
మీసం మెలేసి అధికార పార్టీ ఎంపి జెసి దివాకరరెడ్డికి సవాల్ విసిరి గోరంట్ల వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత స్వచ్చంద పదవీ విరమణ చేసి వైసిపి తీర్ధం పుచ్చుకున్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్ ఆయనకు హిందూపూర్ ఎంపి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.
నామినేషన్ల పర్వం నేటితో ముగియనుండటంతో విఆర్ఎస్ వివాదం తెరమీదకొచ్చింది. విఆర్ఎస్ ఆమోదించకుంటే ఆయన నామినేషన్ను తిరస్కరించే అవకాశం ఉంది. దీంతో ఆయన తొలుత అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను, తరువాత హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టు తీర్పుతో ఆయన హిందూపురం వైసిపి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమైంది. టిడిపి తరపున బరిలో ఉన్న సిట్టింగ్ ఎంపి నిమ్మల కిష్టప్పతో మాధవ్ పోటీ పడబోతున్నారు.
మాధవ్కు హైకోర్టులో తీర్పు అనుకూలంగా రాకుంటే ఆయన సతీమణిని పార్టీ అభ్యర్థిగా ఖరారు చేసి బి ఫాం అందజేయాలని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి నిర్ణయించారు