ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ కు హ్యాండ్ ఇచ్చారు. ఎన్నికల సమయంలో, ఆ తర్వాత కేసీఆర్ తో కలిసి తిరిగిన జగన్ ఇప్పుడు కేంద్రానికి దగ్గరవుతూ కేసీఆర్ కు దూరమవుతున్నారు. కలిసి నడుద్దామని భావించిన వైసీపీ, టీఆర్ఎస్ కాస్త.. ఇప్పుడు వైసీపీ వర్సెస్ టీఆర్ఎస్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే కేసీఆర్ ఆలోచనకు జగన్ మొదటి ఆప్షన్ గా కనిపించారు. కానీ.. ఇప్పుడు జగన్ కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారు. దీంతో టీఆరఎస్ వర్గాలు జగన్ తీరుపై ఆగ్రహంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి హరీశ్ రావు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంత్రి హరీశ్ ఏమన్నారంటే..
‘రైతుల బావులకు, బోర్లకు మీటర్లు అమర్చితే తెలంగాణకు 2,500 కోట్లు, ఏపీకి 4వేల కోట్లు ఇస్తామంటూ కేంద్రం ఆశపెట్టింది. దీనికి ఏపీ సీఎం జగన్ ఆశ పడ్డాడు. కేంద్రం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ రైతుల నడ్డి విరిచేందుకు సిద్ధమవుతోంది. రైతులకు ఉచిత విద్యుత్ దూరం చేయాలనే యోచనలో కేంద్ర ఉంది. ఇందుకు వ్యవసాయ బావులకు, బోర్లకు మీటర్లను అమర్చాలని చూస్తోంది. ఇదొక నియంత్రత్వ పోకడ. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ బిల్లును, కేంద్రం తీరును పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. కానీ.. జగన్ సంపూర్ణ మద్దతిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యలతో వైసీపీని టీఆర్ఎస్ తమ శత్రువుగా భావించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎవరి మేలు కోరి చేస్తున్నారో చెప్పండంటున్న హరీశ్..
దేశమంతా వ్యతిరేకిస్తున్న ఈ బిల్లును ఎవరి మేలు కోసం ప్రవేశపెడుతున్నారో కేంద్రం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు హరీశ్. రైతులు రోడ్డెక్కుతున్నా కేంద్రానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మొక్కజొన్న దిగుమతిపై సుంకాలను తగ్గించడం దేనికి సంకేతమో చెప్పాలన్నారు. విదేశాల నుంచి మొక్కజొన్నలు తెస్తే మనం పండించే మొక్కజొన్నను కొనేదెవరు? అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి కేంద్రం తీరును తప్పుబడుతూనే ఏపీ వ్యవహరిస్తున్న తీరుపై కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించారు మంత్రి హరీశ్.