కేసీఆర్ కు జగన్ కు మధ్య మంచి స్నేహం ఉంది. ఇందుకు వీరిద్దరికీ కామన్ శత్రువైన చంద్రబాబు నాయుడు కూడా ఒక కారణం. ఈ శత్రువును జయించడానికి 2109 ఎన్నికల ముందు చిగిరుంచిన స్నేహం ఎన్నికల ముందు మొగ్గలు తొడుక్కుని ఫలితాల తర్వాత పూవులుగా విరబూసింది. ప్రస్తుతం ఈ పూవుల రేకలు ఒక్కోటిగా రాలిపోతున్నట్టుగా ఉంది. పైకి స్నేహంగా ఉన్నామని అంటూనే కారాలు మిరియాలు నూరుకుంటున్నారు. తాజాగా రాయలసీమ ఎత్తిపోతల పథకం (పోతిరెడ్డిపాడు) విషయంలో ఒకరిపై మరొకరు కేంద్రానికి ఫిర్యాదులు చేసుకుంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.
సుప్రీంకు తాజా పిటిషన్ లో ఏముందంటే..
రాయలసీమ ఎత్తిపోతలపై పథకంపై ఏపీ ముందుకు పోకుండా.. టెండర్ ప్రక్రియ చేపట్టకుండా చూడాలని కోరుతూ తెలంగాణ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నిజానికి కేసీఆర్ ఈరోజు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆధ్వర్యంలో ఏపీ సీఎంతో కలిసి సమావేశం కావాల్సి ఉంది. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై చర్చించాల్సి ఉంది. కానీ.. కేసీఆర్ ఇందుకు విముఖత చూపించారు. అపెక్స్ కౌన్సిల్ లో తేల్చుకోవాల్సిన అంశాన్ని ఒక్కసారిగా కేసీఆర్ సుప్రీంకు వెళ్లడం చర్చనీయాంశమైంది. దీని వెనుక కేసీఆర్ వ్యూహం ఏమై ఉంటుందో అనే ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఏపీ ప్రభుత్వ వైఖరి ఏంటి..
రాయలసీమ ఎత్తిపోతల అంశాన్ని సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వచ్చే ఏడాదికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని భావిస్తున్నారు. రోజుకు 3టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని అధికారులతో సీఎం అంటున్నారు. దీనిని ఆపేదిలేదని కూడా అధికారులు అంటున్నారు. ఈనేపథ్యంలో సుప్రీంకోర్టులో ఏపీ ఎలా కౌంటర్ దాఖలు చేస్తుందో అనే ఆసక్తి నెలకొంది. తెలంగాణ అభ్యంతరాలను ఏపీ ఎలా తిప్పికొడుతుంది.. నీటి లెక్కలను ఎలా చూపిస్తుంది.. తమ వాటాలోని 512 టీఎంసీల నీటిని వాడుకునే లెక్కల్ని ఎలా చెప్పుకొస్తుందో కీలకంగా మారింది. లేదా.. కీసీఆర్ తోనే మరోసారి భేటి అయ్యి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటారో చూడాల్సి ఉంది.