జాతీయ రాజకీయాల్లో కేసీఆర్..! ఈ మాట ఇప్పటిది కాదు. నాలుగైదేళ్లుగా కేసీఆర్ పాడుతున్న పాట. అయితే.. బీజేపీ వ్యతిరేక పక్షాలను కూడగట్టే క్రమంలో కాంగ్రెస్ వ్యతిరేక పక్షాలను కూడా కలిపే ప్రయత్నాలు చేస్తున్నారు. దీని ద్వారా తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనేది కేసీఆర్ ప్లాన్. ప్రాంతీయ పార్టీలు జాతీయ శక్తిగా ఎదగాలంటే.. ప్రాంతీయ పార్టీల్లో అతిపెద్ద శక్తిగా ఉన్న మమతా బెనర్జీ, కేజ్రీవాల్, జగన్, నవీన్ పట్నాయక్, స్టాలిన్.. సాయం తప్పనిసరి. వీరందరితో కేసీఆర్ కొత్త పార్టీ ఏర్పాటు చేసినా తానే పగ్గాలు అందుకుంటాడని.. అందుకు వారంతా ఒప్పుకుంటారని నమ్మకం లేదు. వీరి నుంచి మద్దతు లభించినా తెలంగాణ ప్రజల నుంచి మద్దతు ఎంతమేర ఉంటుందనేదే ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే..
లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ తీర్పు.. గుర్తుందిగా..
2018 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ కు తిరుగులేని ఆధిపత్యం ఇచ్చారు తెలంగాణ ప్రజలు. నువ్వే మహారాజువయ్యా.. నువ్వే మా సీఎం.. అంటూ నెత్తినపెట్టుకుని మరీ అసెంబ్లీకి పంపించారు. అయితే.. ఇదే ఊపు పార్లమెంట్ ఎన్నికల్లో లేకపోయింది కేసీఆర్ కు. అసెంబ్లీ హవానే కొనసాగుంటే 16 స్థానాలకు కనీసం 14 అయినా రావాలి. కానీ సగానికి సగం.. అంటే 8 స్థానాలతో సరిపెట్టుకుంది. మిగిలినవి బీజేపీ, కాంగ్రెస్ పంచుకున్నాయి. దీంతో కేసీఆర్ ను జాతీయ రాజకీయాల్లోకి పంపించడం ప్రజలకు ఇష్టం లేనట్టుంది. కానీ.. కారు సారు మనసు ఢిల్లీ వైపు పరుగులెడుతోంది. రాష్ట్ర పగ్గాలు తనయుడు కేటీఆర్ కు అప్పగించి ఢిల్లీ గద్దెనెక్కాలనేది కేసీఆర్ ఆలోచన.
జాతీయపార్టీ సన్నాహాలిలా..
‘నయా భారత్’ పేరుతో కేసీఆర్ ఒక జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2022 చివర్లో.. లేదా 2023లో జమిలి ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో కేంద్రం ఉందని వార్తలు వస్తున్నాయి. దేశంలో అధ్యక్ష తరహా ఎన్నికలు జరిగే అంశంపై గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఆధ్వర్యంలో ఓ కమిటీ వేసింది. ఇది అమల్లోకి వస్తే లోక్సభ ఎన్నికల్లో జాతీయ పార్టీలు మాత్రమే పోటీ చేయాలి. ఈనేపధ్యంలో కేసీఆర్ జాతీయపార్టీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ‘నయా భారత్’ పేరుతో హరియాణా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పార్టీలు ఉండటతో వారితో టీఆర్ఎస్ నేతలు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. దీనిపై మాడభూషి శ్రీధర్ వంటి న్యాయ ప్రముఖులతో కూడా కేసీఆర్ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సోమవారం జరిగే టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో ఈ విషయాలపై చర్చ జరగొచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి.