హైదరాబాద్: తనపై సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేసున్నారంటూ వైసిపి నేత లక్ష్మీ పార్వతి సోమవారం డిజిపి మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.
అనంతరం లక్ష్మీ పార్వతి మీడియాతో మాట్లాడుతూ..’కోటి అనే వ్యక్తిని నా బిడ్డలాగా భావించాను. కానీ అతను నా ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నాడు. గౌరవ ప్రదమైన స్థాయిలో ఉన్న నన్ను కించపరుస్తూ విమర్శలు చేస్తున్నాడు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
‘ఈ నెల నాలుగొవ తేదీన కోటి టివి చానెల్స్, సోషల్ మీడియాలో నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ నా వ్యక్తిత్వాన్ని కించపరిచాడు. ఇందుకు గాను కోటితో పాటు ఆరోపణలను ప్రచారం చేసిన మీడియా చానెల్, యాంకర్స్పై చర్యలు తీసుకోవాలని డిజిపికి ఫిర్యాదు చేశాను. దీని వెనక ఉన్న కుట్రను ఛేదించి నా పరువు మర్యాదలు కాపాడాలి’ అని డిజిపిని కోరినట్లు ఆమె తెలిపారు.
తనను లక్ష్మీ పార్వతి లైంగికంగా వేధిస్తోందంటూ గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఉప్పరపాలెం గ్రామానికి చెందిన కోటి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల వేళ రాష్ట్రంలో ఈ విషయం తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలో కోటిపై చర్యలు తీసుకోవాలంటూ లక్ష్మీపార్వతి తెలంగాణ డిజిపిని ఆశ్రయించారు.