Telangana Congress: తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టికెట్ లు ఆశిస్తున్న నేతలు తమ పార్టీలో టికెట్ లు దక్కే అవకాశం లేకపోవడంతో రాజీనామా చేస్తున్నారు. ప్రత్యర్ధి పార్టీలో చేరిపోతున్నారు. ఇప్పటి వరకూ తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ మాత్రమే పార్టీ అభ్యర్ధులను ప్రకటించింది. దీంతో టికెట్లు ఆశించి భంగపడిన నేతలు వరుసగా కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. ఇదే అదునుగా పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల నుండి వస్తున్న నేతలందరికీ పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలుకుతోంది. కొందరు ఢిల్లీలో, కొందరు గాంధీ భవన్ లో నేతల సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటున్నారు.
రీసెంట్ గా మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తనకు తన కుమారుడికి టికెట్ ఆశించగా, పార్టీ అధిష్టానం ఆయనకు మాత్రం టికెట్ ఖరారు చేసి ఆయన కుమారుడు రోహిత్ రెడ్డికి మెదక్ టికెట్ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఆయన బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మైనంపల్లి హనుమంతరావుకు మల్కాజిగిరి, ఆయన తనయుడు రోహిత్ రెడ్డికి మెదక్ అసెంబ్లీ టికెట్ దాదాపు ఖరారు అయినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఈ పరిణామం మెదక్ జిల్లా కాంగ్రెస్ లో ప్రకంపనలు రేపింది.
ఇప్పటి వరకూ మెదక్ అసెంబ్లీ స్థానాన్ని మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్న కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లోనే ఆయన పోటీ చేయాలని భావించినా టికెట్ రాలేదు. ఈ సారి ఎట్టిపరిస్థితుల్లో పోటీ చేయాలని గత అయిదేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. నియోజకవర్గంలో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని చురుగ్గా నిర్వహించారు. దాదాపు టికెట్ ఖరారు అనుకుంటున్న తరుణంలో బీఆర్ఎస్ నుండి పార్టీలోకి చేరిన ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తనయుడు రోహిత్ కు కన్ఫర్మ్ చేస్తున్నారని తెలియడంతో తిరుపతిరెడ్డి తీవ్ర అసంతృప్తికి గురైయ్యారు.
గత రెండు రోజులుగా తన అనుచరులతో సమావేశాలు నిర్వహించిన తిరుపతిరెడ్డి ఇవేళ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆయన ఏ పార్టీలో చేరుతున్నారు అనేది ప్రకటించకపోయినా బీఆర్ఎస్ కు మద్దతు తెలిపే అవకాశాలు ఉన్నాయని ఆయన సన్నిహితులు అంటున్నారు. రాజీనామా చేస్తున్న సందర్భంగా తిరుపతిరెడ్డి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకూ పార్టీ కోసం తాను పడిన శ్రమ అంతా వృధా అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పారాచూట్ నేతలకే కాంగ్రెస్ పెద్ద పీట వేస్తుందని విమర్శించారు తిరుపతిరెడ్డి. పార్టీ కోసం కష్టపడి పని చేసిన తన లాంటి కార్యకర్తలకు ఈ పార్టీలో స్థానం లేదనే విషయం తేటతెల్లమైందని రాజీనామా లేఖలో వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ కోసం చేసిన సేవలు, త్యాగాలు, పడ్డ కష్టాలను గుర్తించకుండా కేవలం డబ్బు సంచులే ప్రాతిపదికగా టికెట్లు ఇవ్వడం ఆవేదనకు గురి చేసిందని తిరుపతిరెడ్డి విచారం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్ధుల ప్రకటన తర్వాత ఆ పార్టీ నుండి అసంతృప్తులు కాంగ్రెస్ పార్టీలో చేరుతుండగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల ప్రకటన తర్వాత ఈ పార్టీ లో టికెట్ లు ఆశించి భంగపడిన వారు పలువురు బీఆర్ఎస్ లేదా బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎన్నికల సమయంలో జంపింగ్ జిపాంగ్ లు సర్వ సాధారణమే.
Pawan Kalyan Varahi Yatra: నాల్గవ విడత వారాహి యాత్రలో పవన్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి