Nara Lokesh: ఎట్టెట్టా..? నారా వారి లోకేశానికి ఆవేశమొచ్చినాదా..!? అది కూడా సీఎంని పట్టుకుని “ఏరా.. రారా” అన్నంతగా వచ్చేసినాదా..!? ఇది అప్పుడుకప్పుడే వచ్చేసినాదా..!? ముందు నుండీ అనుకుని నటనతో కూడితే వచ్చేసినాదా..? ఏటో… సీమ గడ్డ మీద టీడీపీ సిన్నోడు మాటాడిన మాటలకు.., అరిసిన అరుపులకు.., సేసిన సవాళ్లకు సీకాకుళం నుండి సీమ వరకు సైడు టాకింగులు మొదలైపోనాయి..! టీడీపీ వాళ్లేమో మావోడు మొనగాడు – మావోడు మొగోడు – మావోడు మొగుడు అనుకుంటూ ఈలలు ఏసుకుంటున్నారు.. వైసీపీ వోలేమో కామెడీగా తీసుకుంటున్నారు.. కానీ లోలోపల ఆలోసిస్తన్నారు.. కానీ రాజకీయాన్ని లోతుగా ఈదీసిన నాలాటోల్లు మాత్రం దీని ఎనకాతల ఏదో ఉంది అని ఎతికే పనిలో పడ్డారు.. అలా ఎతకగా, ఎతకగా ఇదిగో ఈ ఆలోచనలు తట్టాయి…. ఇంతకూ ఇది అజ్ఞానంతో కూడిన అజ్ఞానావేశామా..!? సగం సగం తెలిసిన అర్ధావేశమా..!? సన్నివేశానికి తగ్గట్టు సీన్ పండించేందుకు వచ్చిన అత్యావేశమా..!?
Nara Lokesh: అర్ధాలు – ఆవేశాలు – అత్యాలు
* కర్నూలు జిల్లాలోని నంద్యాల ఉప ఎన్నికలో అప్పట్లో జగను ఏమన్నారు..!? చెట్టంత చంద్రబాబుని పట్టుకుని.., 45 ఏళ్ళ సీనియర్ ని పట్టుకుని.., “ఇట్టాటి ముఖ్యమంత్రిని నడిరోడ్డు మీద ఉరి తీసినా తప్పు లేదు” అన్నారు… మరి అదే గడ్డ మీద లోకేశం ఆవేశం తెచ్చుకోకపోతే మనోడు ఇంకా చిన్నోడే అనుకుంటారు కదా..!? ఇదే నిజమైతే జగను పెరిగిన సంస్కృతి వేరు, తను పెరిగిన సంస్కృతి వేరు. తానూ అలా మారాలి, అలా మాటాడాలి అనుకోకూడదు కదా… అందుకే ఆవేశపడితే అది అజ్ఞానావేశమే…!
* అసలే కర్నూలు.. ఆపై ఫ్యాక్షన్ గొడవ.. అందులోకి తాను వెళ్ళింది హత్యా బాధితుల కుటుంబ పరామర్శకు.. ఆ బాధితుల మనస్సులో, మెదడులో ఆవేశం పాళ్ళు బోలెడు ఉంటాయి. వాటిని తన మాటలతో కవ్విస్తే మంచిగా కుదురుకోవచ్చు.. పరామర్శకు ఊపొస్తుంది. వారికీ గుర్తుంటుంది. అందుకే అప్పటికప్పుడే వచ్చేసిన ఆవేశం కావచ్చు.. అయినా ఇది అర్ధావేశమే..!
* అసలే తనను పప్పు పప్పు అంటున్నారు.. ఆ పేరు గురించి తనేమి ఫీల్ అవ్వలేదు. పైగా ఈ మధ్య పదే పదే కౌంటర్లు ఇస్తున్నారు కూడా.. ఏడాదిన్నర నుండి లోకేసులో మార్పులు మొదలయ్యాయి అనే చర్చ కూడా మొదలయింది. మాట మారింది. నడత మారింది. పలకరింపు మారింది. నలుగురితో మెలిగే తీరు మారింది అంటూ టీడీపీలోనే లోలోపల మాటాడుకుంటున్నారు. అందుకే తనలోకి ఆవేశం పాళ్ళు కూడా బోలెడు వచ్చాయి.. ఈ ఏడాదిలో అర్థరహిత ఆవేశ పడడం కూడా నేర్చుకున్నాను అని నిరూపించుకుని అనేసారేమో.. అదే అయితే అది అత్యావేశమే…!
* పై మూడు రకాల ఆవేశాలు కాకుండా అప్పటికప్పుడు ఆ బాధితులను చూసి.. వారు చెప్పిన మాటలు విని మనసు తరుక్కుపోయి.. గుండె బరువెక్కి వచ్చిన ఆవేశమైతే లోకేశంలో నిజంగా కొంత మెచ్యూరిటీ వచ్చేసినట్టే. అన్నిటికీ మించి లోకేశానికి బాగా తెలుసు. “టీడీపీ శ్రేణులు ఇప్పుడు దూకుడు కోరుకుంటున్నాయి. దెబ్బతిని ఉన్నవారికి దూకుడుగా ఉన్న నాయకుడు అండగా ఉంటె కాసింత మనసు కుదుటగా ఉంటుంది. పని చేయాలన్న కసి పెరుగుతుంది. ప్రత్యర్థిని ఎదుర్కోవాలన్న తపన మొదలవుతుంది. అందుకే ఆ కసి, తపన, దూకుడుని కలిపి తనలో చూపించినట్టున్నారు. లోకేశు కొన్ని నెలలుగా ఒక్కో దశలో మార్పులు చూపిస్తూనే ఉన్నారు. తిరుపతి ఉప ఎన్నికల ఉపన్యాసం మొదలుకుని, ఈ మధ్య పరీక్షల రద్దు కోసం పిల్లలతో ఇంటరాక్షన్ వరకు కొత్త లోకేశాన్ని పరిచయం చేస్తున్నారు. లొకేషన్ మారితే లోకేష్ మారుతున్నాడు.. మాటల్లో అంతరాలను మారుస్తున్నాడు.. ఇదే కావాలాల్సింది. ఇదే టీడీపీ కోరుకుంటున్నది కూడా.. అందుకే పై మూడు రకాల ఆవేశాలు కాకుండా ఈసారికి అక్కడ పరిస్థితిని చూసి మనసు నుండి వచ్చిన ఆవేశంగానే పరిగనిద్దాం..!