నెలల క్రితం ఏపీ సీఎం జగన్ కు, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు మధ్య జరిగిన గొడవ గురించి తెలిసిందే. కరోనా ప్రారంభంలో బూచీగా చూపి స్థానిక సంస్థల ఎన్నికలను ఏకపక్ష నిర్ణయంతో ఆపేశారు ఎస్ఈసీ. ప్రజా క్షేమం కోరి ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించి ప్రభుత్వానికి బద్ద శత్రువయ్యారు. ఇప్పుడేమో.. ఎన్నికలు నిర్వహించాల్సిందే అంటూ తనవల్ల కాదని తెలిసి కోర్టుకు వెళ్లారు. ఏ కరోనా వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారని ఎన్నికలు వాయిదా వేశారో.. ‘కరోనా కేసులే తగ్గాయి.. తీవ్రత కాదు’ అని కేంద్రం ఓపక్క హెచ్చరిస్తున్నా.. తాను కోరిన ప్రజా క్షేమం వదిలేసి ఎన్నికల నిర్వహణకు పట్టుబడుతున్నారు.. అదే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.
ప్రభుత్వానికి ఇష్టం లేదు మొర్రో అంటే వినరే..!
ఇక్కడ నిమ్మగడ్డకు దొరికిన పట్టు.. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు. ఓ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలే జరుగుతుంటే ఇవెంత.. అనేది ఆయన వాదన. పైకి అలా అంటున్నా.. ‘లోగుట్టు పెరుమాళ్ల కెరుక’ సామెత ఉండనే ఉంది కదా. కోర్టు ద్వారా పదవి తిరిగి తెచ్చుకున్నా.. ప్రస్తుతం నిమ్మగడ్డ ఖాళీనే. దీంతో.. ‘నేనున్నాను’ అని చెప్పుకోవడానికే ఎన్నికల అంశం తీసుకొచ్చారనేది ఓ వాదన. అయితే.. ఎన్నికల నిర్వహణ అనేది ప్రభుత్వ నిర్ణయం. తాను పూనుకుని, సన్నధ్దమైతే ఎన్నికల సంఘం సిద్ధమవ్వాలి. కానీ.. ఇక్కడా ఏపీ ఎస్ఈసీ ఎన్నికల కోసం ఉత్సాహపడుతున్నారు. ఈ తతంగమంతా.. ‘ఆయనకెందుకు ఈ సరదా..’ అనే అనుమానాలతోపాటు.. పార్క్ హయాత్ అంశాన్ని గుర్తు చేసుకోవాల్సి వస్తోంది.
ఆల్ పార్టీ మీటింగ్ వల్ల ఎవరికి ఉపయోగం..?
ఎన్నికలకు తాము సిద్ధంగా లేమని ప్రభుత్వమే చెప్తుంటే.. ఆల్ పార్టీ మీటింగ్ అంటూ ఎస్ఈసీ హడావిడేంటో అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి టీడీపీ, వామపక్షాలు, జనసేన, కాంగ్రెస్.. హాజరవుతాయనే అనుకుందాం. ఎన్నికలు జరపాలనే అంటారు సరే..! మరి.. రెండేళ్ల క్రితమే జరగాల్సిన ఎన్నికలను తామెందుకు వాయిదా వేసామో టీడీపీ ఆ మీటింగ్ లో చెప్తుందా.. మిగిలిన పార్టీలు టీడీపీని అడుగుతాయా? అసలు అధికారంలో ఉండగా ఆ మిగిలిన పార్టీలను పట్టించుకున్నారా.. నాయకుల మొహాలు చూశారా..? మరి ఆల్ పార్టీల మీటింగ్ ఎందుకు.. ఎవరి కోసం..? ఇక్కడే.. మళ్లీ పార్క్ హయాత్ గుర్తుకొస్తోంది.. అందరికీ..! ఎస్ఈసీ గారూ.. మీకు అర్ధమవుతోందా..!