శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ప్రమాదంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న రేవంతర్ రెడ్డిని దిండి సమీపంలో పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం జరిగింది. ఇప్పటికే శ్రీశైలం ఘటనపై జోక్యం చేసుకోవాలని గవర్నర్ తమిళిసై కు రాసిన లేఖలో రేవంత్ రెడ్డి కోరారు. ఇది మానవ తప్పిదమే అని రేవంత్ ఆరోపించారు. సిబ్బంది రెండు రోజుల క్రితమే హెచ్చరించినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదని రేవంత్ పేర్కొన్నారు. ప్రమాదానికి మంత్రి జగదీశ్వర్ రెడ్డి, సీఎండీ ప్రభాకర్ రావు బాధ్యత వహించాలని రేవంత్ డిమాండ్ చేశారు. బాధితులకు కోటి పరిహారంతోపాటు ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
బాధిత కుటుంబాలను పరామర్శించే స్వేచ్ఛ మాకు లేదా.
దీంతో కేసీఆర్ కూడా రేవంత్ రెడ్డిపై ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. గతం నుంచీ కూడా సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి ఉన్న వైరం తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సీఎంపై శ్రీశైలం ఘటనలో రాజకీయంగా ఇరుకున పెట్టాలని భావించారు. అయితే.. రేవంత్ ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నారని భావించారు. దీంతో రేవంత్ నాగర్ కర్నూలు వెళ్తూండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులకు కాంగ్రెస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడ స్వల్ప ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రాష్టంలో కేసీఆర్ నియంతలా మారారని.. బాధిత కుటుంబాలను పరామర్శించే స్వేచ్ఛ కూడా ప్రతిపక్ష నేతలకు లేకుండా చేస్తున్నారని ట్విట్టర్లో ఆరోపించారు. కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారంటూ ప్రశ్నించారు.
కీసర ఎమ్మార్వో కేసులో కూడా రేవంత్ రెడ్డి హస్తంపై పుకార్లు..
కీసరగుట్టలో ఎమ్మార్వో కేసులో రేవంత్ పాత్ర ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మార్వో వద్ద 100 కోట్లు అవినీతి సొమ్ము ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఆయన కోటి రూపాయలు లంచం తీసుకుంటూండగా పట్టుకున్నారు. ఆయన వద్ద రేవంత్ రెడ్డికి సంబంధించి దస్తావేజులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ కేసులో రేవంత్ రెడ్డిని ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే.. ఇందుకు తగ్గ బలమైన ఆధారాలు వారికి లభించలేదు. దీంతో రేవంత్ రెడ్డిని ఈ కేసులో ఇరికించాలని కేసీఆర్ భావిస్తుంటే.. శ్రీశైలం ఘటనలో కేసీఆర్ ను దోషిగా చూపేందుకు రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారు.