పాపం చంద్రబాబు.., పాపం టీడీపీ..!! ప్రతిపక్షమంటే ఈ మాత్రం జాలి, దయ, కరుణ లేకుండా జగన్ ఎమ్మెల్యేలను లాగేసారు. బాబుకి నిద్ర లేకుండా చేశారు. ఆయనకు ఆ ప్రతిపక్ష పాత్ర కూడా మిగలకుండా పోతుందా..? అనేంతగా భయపడేలా చేశారు..! ఏకంగా ఏడాదిన్నరలోనే నలుగురు ఎమ్మెల్యేలను లాగేసి భయపెట్టారు. ఇది ఇక్కడితో ఆగినట్టేనా..? ఇంకా ఉందా..? అనే అనుమానాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. వాటికి చంద్రబాబుకి కొంచెం ఊరట కలిగే వార్తలు మాత్రం వస్తున్నాయి. ఒక్కరు మినహా మిగిలిన అందరూ ఉన్నట్టేనని టీడీపీ వర్గాలు ధీమాగానే ఉన్నాయి.
చంద్రబాబు మినహా ఇప్పుడు టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలను ఓ సారి చూసుకుంటే… ఆదిరెడ్డి భవాని (రాజమండ్రి సిటీ), గోరంట్ల బుచ్చయ్య చౌదరి (రాజమండ్రి గ్రామీణం), జోగేశ్వరరావు (మండపేట), చినరాజప్ప (పెద్దాపురం), వెలగపూడి రామకృష్ణ (విశాఖ తూర్పు), గణబాబు (విశాఖ పశ్చిమ), గంటా శ్రీనివాసరావు (విశాఖ ఉత్తర), నిమ్మల రామానాయుడు (పాలకొల్లు), వేటుకూరి రామరాజు (ఉండి), భేతాళం అశోక్ (ఇచ్చాపురం), కింజరాపు అచ్చెన్నాయుడు (టెక్కలి), బాలకృష్ణ (హిందూపురం), ఏలూరి సాంబశివరావు (పర్చూరు), గొట్టిపాటి రవికుమార్ (అద్దంకి), అనగాని సత్య ప్రసాద్ (రేపల్లె), డీబీవీ స్వామి (కొండపి), పయ్యావుల కేశవ్ (ఉరవకొండ)..! సో.., చంద్రబాబు కాకుండా 19 మంది ఉన్నారు. వీరిలో…!!
ఒక్కరే దూరమయ్యే అవకాశం..!!
వీరిలో చినరాజప్ప, బుచ్చయ్య చౌదరి, రామానాయుడు, అచ్చెన్నాయుడు, కేశవ్, వెలగపూడి రామకృష్ణ లాంటి వాళ్ళు టీడీపీకి కంకణబద్ధులు. చంద్రబాబుకి అత్యంత నమ్మకస్తులు అసలు పార్టీని వీడరు. కొన్ని నెలల కిందట ఇదిగో, అదిగో పార్టీ మారిపోతారు అనుకున్న ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, గణబాబు, సత్యప్రసాద్ కూడా ఆ జాబితాలోకి చేరిపోయారు.
* కొండపి స్వామి, ఇచ్చాపురం అశోక్ ఇద్దరూ వైద్యులు, జనంతో బాగా ఉన్నవారు. పార్టీలు మారడం మనకు అవసరమా..? అనుకునే ధోరణిలో సైలెంట్ గా పని చేసుకుంటున్నారు.
* ఇక మిగిలిన వారిలో గొట్టిపాటి రవికుమార్ కి ప్రత్యేక పరిస్థితులు. నిజానికి గంటా శ్రీనివాసరావు, గొట్టిపాటి రవికుమార్ ఇద్దరూ కూడా పార్టీలో ఇన్నాళ్లు ఉంటారని చంద్రబాబు కూడా ఊహించి ఉండరు. కానీ అటు సామాజికవర్గం, ఇటు బాబు యత్నాలతో రవికుమార్ అలా టీడీపీలో సెట్టయిపోయారు. ఇప్పుడిప్పుడే జగన్ కి, వైసిపికి యాంటీ అవుతున్నారు. “నన్ను దెబ్బ తీశారు, నేను దెబ్బ తింటాను. కానీ నా టైం రాకమానదు” అంటూ సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. అంటే ఆయన ఇక వైసీపీ వెళ్ళనట్టే.
* ఇక అనుమానాలు మిగిలింది ఇద్దరిపైనే ఆదిరెడ్డి భవానీ, గంటా శ్రీనివాసరావు. వీరిలో ఆదిరెడ్డి భవానీ టీడీపీకి ఒకప్పుడు పెద్దదిక్కుగా ఉన్న కింజరాపు ఎర్రన్నాయుడు కూతురు. ఆమె బాబాయి అచ్చెన్నాయుడు పార్టీ అధ్యక్షుడుగా ఉన్నారు. సో.., ఆమెకి మారాలని లేదు. కానీ ఆమె మామ, ఆదిరెడ్డి అప్పారావు మాత్రం వైసీపీతో టచ్ లో ఉన్నారు. ఆయన గతంలో అదే పార్టీలో ఉంటూ, టీడీపీకి వచ్చారు. ఇప్పుడు అటు వెళ్లాలని ఆయనకు ఉంది, కానీ ఈ కుటుంబం ఏకాభిప్రాయానికి రావడం లేదు. అందుకే ఇప్పుడే చెప్పలేం.
* ఇక మిగిలింది గంటా శ్రీనివాసరావు గురించే.. ఈయన గురించి ఎన్ని చెప్పినా అక్షరాలు చాలవు. సింపుల్ గా చెప్పాలంటే ఈయన టీడీపీలో ఉండరు. ఆ విషయం ఆయన అనుచరులకు, విశాఖ వాసులకు, నియోజకవర్గ ఓటర్లకు, చంద్రబాబుకి, లోకేష్ కి అందరికీ తెలుసు. కానీ వైసీపీలో ద్వారాలు మూసేసారు. ఆ ద్వారం వద్దనే కూర్చుని తొంగి చూస్తున్నారు. పిలుపు వచ్చిన వెంటనే లోపలి దూకెయ్యాలని. మరోవైపు బీజేపీ ద్వారాలు తెరిచి రమ్మంటుంది. వైసీపీ ద్వారాలు తెరుచుకోకపోతే, బీజేపీ ద్వారంలోకి వెళ్లడం ఖాయం.