అమరావతి: అమరావతి భూముల విలువ తగ్గించడం కోసమే వైసిపి కుట్ర చేస్తున్న విషయం విజయసాయిరెడ్డి ట్వీట్తో బయటపడిందని టిడిపి నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. టిడిపి అధినేత చంద్రబాబుపై విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలకు బుద్దా ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాజధాని భూముల ధరలు ఢమాల్ అవ్వడమే చంద్రబాబు బాధంతా అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
వైసిపి నాయకుల తుగ్లక్ ప్రకటనల వెనుకున్న కుట్ర బట్టబయలు అయ్యిందని బుద్దా పేర్కొన్నారు. 28వేల మంది రైతుల పొట్టకొట్టి వైసిపి నేతల కడుపు నింపాలని కల కంటున్నారా అని బుద్దా ప్రశ్నించారు. ఆ రైతులే వారికి బుద్ధి చెబుతారని బుద్దా అన్నారు.
ప్రభుత్వ తుగ్లక్ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటం కోసం రోడ్డెక్కుతున్న సంఘాలు, ప్రజలను టిడిపి పెయిడ్ ఆర్టిస్టులు అంటూ వైసిపి పేటిఎం బ్యాచ్తో ముద్రవేసి ఆనందిస్తున్నారని బుద్దా విమర్శించారు. బాధితులను అవమానించడానికి సిగ్గనిపించడం లేదా అని బుద్దా ప్రశ్నించారు.
డ్యామ్లు అన్ని నిండి కళకళలాడుతున్నాయని విజయసాయిరెడ్డి పేర్కొనడంపై..కరువుకు జగనన్న బ్రాండ్ అంబాసిడర్ అని ప్రభుత్వ వెబ్ సైట్లోనే ఉంది, తమరికి తెలియదా అని బుద్దా ప్రశ్నించారు. రాష్ట్రంలో వర్షం లేక కరువు తాండవిస్తోందని ప్రభుత్వ నివేదికలే తెలియజేస్తున్నాయని బుద్దా పేర్కొన్నారు. కాళ్లు మొక్కే పని పూర్తి అయ్యాక కాస్త ఖాళీ చేసుకుని వాటిని చూడండని బుద్దా సూచించారు.
‘సిఎంఒ సలహాదారులు, నామినేటెడ్ పోస్టులన్ని రెడ్లకే ఇచ్చారు. యూనివర్శిటీ విసి, రిజిస్టార్లను రెడ్లతోనే నింపేశారు. చివరకు పెరోల్పై విడుదలయ్యే ఖైదీలు కూడా రెడ్లే, ఇది ఒక సామాజిక వర్గానికి మాత్రమే ఇస్తున్న ప్రయోజనాలు కావా’ అని బుద్దా ప్రశ్నించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?