గ్రేటర్ ఎన్నికలు రాజకీయ కురుక్షేత్రాన్ని తలపించాయని చెప్పాలి. కొదమసింహాల్లా తలపడ్డ టీఆర్ఎస్-బీజేపీ, మనకెందుకొచ్చిన గొడవ.. అని పోటీలో నిలిచిన కాంగ్రెస్-టీడీపీ, నా దారి రహదారి అనే రీతిలో ఎంఐఎం.. ఇలా ఎవరికి వారు ప్రచారంలో దూసుకెళ్లిపోయారు. ప్రజలకు వరాలు ప్రకటిస్తూ.. నువ్వలా.. అంటే.. నువ్వే ఇలా.. అంటూ పార్టీలు సోషల్ మీడియాలో హీరోల ఫ్యాన్స్ లా తిట్టుకున్నారు. మొత్తానికి ప్రచారాన్ని.. మమ అనిపించి ఓటింగ్ కోసం చూసిన పార్టీలకు ‘ఓటరు’ భారీ షాక్ ఇచ్చాడు. టైం వేస్ట్ యవ్వారం అనుకున్నాడో ఏమో.. ఓటేయడానికి రాలేదు. కింద పడ్డా తమదే పైచేయి అన్నట్టు.. రేపటి ఫలితాల కోసం ఎదురు చూస్తూ.. ‘మేమే విజేతలం’ అనుకుంటున్నాయి పార్టీలు.
పార్టీల మనోగతం..
ఓటింగ్ తక్కువ వస్తే అధికార పార్టీకే టెన్షన్. టీఆర్ఎస్ లో ఆ టెన్షన్ ఉంటుందనే చెప్పాలా? ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు మనకే.. అనుకునే బీజేపీకి ఏదో మూల అనుమానం ఉందా? పార్టీని ఎందరో వీడినా పార్టీని నడిపిస్తున్నాం.. అయినా ఈసారి కష్టమే.. చూద్దాం.. అనే ధోరణిలో కాంగ్రెస్ ఉందనుకోవాలా..! నాయకత్వం మాట దేవుడెరుగు.. ప్రజల్లో, కార్యకర్తల్లో బలం ఉంది.. కానీ.. ఓటు పడటం లేదనే బెంగ టీడీపీలో ఉన్నట్టేనా..? నా ఓట్లు నాకే.. అనే ధీమాతో ఎంఐఎం నిశ్చింతగా ఉందా..? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే. ఎగ్జిట్ పోల్స్ లేకపోవడం వీరికి మరో టెన్షన్ అయి కూర్చుంది. దీంతో.. పైకి గాంభీర్యం ప్రదర్శించడం తప్ప ప్రస్తుతానికి చేసేదేం లేదు. అయితే..
గెలుపుపై పార్టీల నమ్మకం..
టీఆర్ఎస్.. అభివృద్ధి, ప్రభుత్వ పథకాలు, అధికారంలో ఉన్నది తామే, హైదరాబాద్ లో ప్రశాంతత, కేసీఆర్ నాయకత్వం, 40-50 ఏళ్ల పైబడ్డ వారి ఆలోచనలు.. తమకే ఓట్లు పడేలా చేస్తాయని ధీమాలో ఉంది.
బీజేపీ.. ప్రభుత్వ వ్యతిరేకత, మార్పు కోరుకుంటున్న ప్రజలు, కేంద్ర నాయకత్వం, మోదీ ప్రభావం, వరద బాధితులు, సెటిలర్లు, యువత తమనే గెలిపిస్తారని భావిస్తోంది.
కాంగ్రెస్.. ప్రభుత్వ వ్యతిరేకత, మత ప్రస్తావన లేకపోవడం, సమస్యలపై పోరాటం తమను గెలిపిస్తాయని భావిస్తోంది. ఉప్పల్, ఎల్బీ నగర్, మల్కాజ్ గిరి, కుత్బుల్లాపూర్ వంటి పెద్ద ఏరియాలపై నమ్మకంగా ఉంది.
టీడీపీ.. గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు చేసిన అభివృద్ధి కలిసొస్తుందని అంటున్నారు. ప్రజల్లో వస్తున్న మార్పుతో మళ్లీ టీడీపీ పుంజుకుంటుందని భావిస్తోంది. సానుభూతి కలిసొస్తుందనే నమ్మకంతోనూ ఉంది.
ఏదేమైనా ఓటర్లను ఆకర్షించడంలో అందరూ విఫలమయ్యారనే చెప్పాలి. మూడు దశాబ్దాల నాటి మతపరమైన అంశాలు ఎక్కువ కావడం నగర ప్రజల్లో కాస్త అలజడి రేపాయనే చెప్పాలి. మత ప్రచారంగా మారిపోయిన ప్రహసనం ప్రజలకు ఓటింగ్ పై అసహనం తెప్పించాయనే వాదనలూ లేకపోలేదు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?