Srikakulam: రాష్ట్రానికి సరిహద్దు జిల్లాగా వెనుకబడిన ప్రాంతంగా ఉన్నా రాజకీయ చైతన్యం విషయంలో మిగిలిన 12 జిల్లాల కంటే ఎక్కువగా చెప్పుకోవచ్చు. అదే శ్రీకాకుళం జిల్లా. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి చెందిన ప్రభుత్వం అధికారం ఉన్నా ఈ జిల్లాకు చెందిన ఇద్దరు ముగ్గురు మంత్రులుగా గానీ కీలకమైన పదవులు దక్కించుకుంటూ ఉంటారు. ఈ జిల్లాలో ఉన్నది పది అసెంబ్లీ స్థానాలు మాత్రమే. తూర్పు గోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ స్థానాలు ఉన్నా ఇద్దరు లేక ముగ్గురికి మాత్రమే మంత్రి పదవులు లభిస్తుంటాయి, శ్రీకాకుళంలో పది అసెంబ్లీలు స్థానాలు ఉన్నా ముగ్గురు కీలక పదవులు పొందుతుంటారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో ఇద్దరు ధర్మాస ప్రసాదరావు, సిదిరి అప్పలరాజులు మంత్రులుగా ఉండగా, తమ్మినేని సీతారాం అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ ఇద్దరు మంత్రులు ఉన్నారు. అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు. అలానే విప్ గా కోన రవికుమార్ ఉన్నారు. ఈ జిల్లాకు ఉన్న రాజకీయ ప్రాధాన్యతకు ఇవి ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఇప్పుడు ఈ జిల్లా విషయం ఎందుకంటే.. వచ్చే ఎన్నికల్లో ఈ జిల్లాలో అనూహ్య మార్పులు రాబోతున్నాయి.
Srikakulam: ఎంపీలుగా ఎవరు పోటీ చేస్తారో..!?
శ్రీకాకుళం ఎంపిగా ఉన్న కింజారపు రామ్మోహన్ నాయుడు మళ్లీ ఎంపీగా పోటీ చేసే అవకాశం లేదని టీడీపీలో అంతర్గతంగా నడుస్తున్న టాక్. ఎందుకంటే ఆయనకు అసెంబ్లీకి వెళ్లాలని ఉంది. నర్సన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం అయితే పోటీ చేయడానికి తనకు బాగుంటుంది అని రామ్మోహన్ నాయుడు భావిస్తున్నారు. అందుకు ఆయన గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఆయన ఆలోచన అలా ఉంటే.. అక్కడ పార్టీ ఇన్ చార్జిగా ఉన్న బొగ్గు రమణమూర్తి పరిస్థితి ఏమిటి..? ఆయనకు వేరే పదవి ఏమైనా ఇచ్చి సంతృప్తి పరుస్తారు. ఇక శ్రీకాకుళం ఎంపీ స్థానం నుండి టీడీపీ తరపున ఎవరు పోటీ చేస్తారు..? అనే ప్రశ్న ఉదయిస్తోంది. అయితే ఎంపీ స్థానానికి రామ్మోహన్ నాయుడు సోదరి ఆదిరెడ్డి భవానీ ని పోటీకి దింపుతారని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఈ జిల్లాలో కింజారపు ఎర్రంనాయుడు కుటుంబానికి మంచి పట్టు ఉంది. మొదటి నుండి ఈ కుటుంబం గెలుస్తూ వస్తోంది. అందుకే ఆదిరెడ్డి భవానీని ఇక్కడి పార్లమెంట్ కు పోటీకి నిలిపి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమండ్రి స్థానంలో ఆదిరెడ్డి అప్పారావును పోటీ చేయిస్తే బాగుంటుంది అన్నది టీడీపీ అంతర్గత ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. లేకపోతే వేరే ఎవరైనా పోటీ చేయవచ్చు. ఇది టీడీపీలో జరుగుతున్న చర్చ.
వైసీపీలో ధర్మాన తెరపైకి..!?
ఇక వైసీపీ విషయానికి వస్తే సరైన ఎంపీ అభ్యర్ధి లేరు. 2019లో దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేసినప్పటికీ ప్రస్తుతం ఆయన టెక్కలిపై దృష్టి పెట్టారు. టెక్కలి నుండి అసెంబ్లీకి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. అంతకు ముందు పోటీ చేసిన రెడ్డి శాంతి గానీ, పిల్లి కృపారాణి తదితరులు ఎంపీగా పోటీ చేయడానికి అంతగా సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఇప్పుడు వైసీపీ లో జరుగుతున్న చర్చ ఏమిటంటే.. ధర్మాన కుటుంబం నుండి ధర్మాన ప్రసాదరావు గానీ, మంత్రి కృష్ణదాసులో ఒకరు శ్రీకాకుళం ఎంపీ స్థానం నుండి పోటీ చేయనున్నారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే కృష్ణదాసు కుమారుడు కృష్ణచైతన్య ను నర్సన్నపేట నుండి పోటీ చేయించడానికి ఆయన రెడీ అవుతున్నారు. కృష్ణదాసు మంత్రి ఉన్న నేపథ్యంలో ఆయన కుమారుడు కృష్ణ చైతన్యే నియోజకవర్గంలో ఆయనకు సంబంధించి అన్ని వ్యవహారాలు చూస్తున్నారు. ఆయన కూడా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ప్రెపేర్ చేసుకుంటున్నారు. కుమారుడికి నర్సన్నపేట ఎమ్మెల్యే సీటు ఇచ్చి కృష్ణదాస్ ను లోక్ సభకు పోటీ చేయించే ఆలోచనలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఆయన పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేయకపోతే ధర్మాన ప్రసాదరావు వారసుడు కూడా సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఒక వేళ ప్రసాదరావు కుమారుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ప్రసాదరావు ఎంపీ స్థానం నుండి పోటీ చేయనున్నారు. ఎందుకంటే.. ధర్మాన కుటుంబం నుండి లోక్ సభ స్థానం నుండి పోటీ చేస్తేనే వైసీపీకి గెలుపు అవకాశాలు ఉంటాయని ఆ పార్టీలో అంతర్గతంగా భావిస్తున్నారు. ధర్మాన కుటుంబం నుండి కాకుండా వేరే ఎవరు పోటీ చేసినా ఎంపి స్థానం గెలవడం కష్టమేనని ఆ పార్టీ వర్గీయులు చెబుతున్నారుట.
రెండు పార్టీల్లో చకచకా మార్పులు..!?
ఇటు టీడీపీ తరపున కింజరపు రామ్మోహన్ నాయుడు ఫ్రూవ్ చేసుకున్నారు. ఆయన రెండు సార్లు ఎంపీగా గెలిచారు. జిల్లాలోని అన్ని సమస్యలతో పాటు తీర ప్రాంత సమస్యలపై పూర్తిగా అవగాహన ఉంది. ఆ ప్రాంత వాసులతో మంచి పరిచయాలు ఉన్నాయి. సామాజికవర్గ పరంగా అన్ని వర్గాలతో ఆయన కలిసిపోగలరు. రామ్మోహన్ నాయుడు కాకుండా ఇంకా ఎవరైనా పోటీ చేస్తే టీడీపీ కంచుకోట పేరు పోతుందేమో అన్న టీడీపీలో ఉంది. రామ్మోహన్ నాయుడు పోటీ చేయడం వల్ల టెక్కలి, శ్రీకాకుళం, నర్సన్నపేట తదితర నియోజకవర్గాల్లో కలిసి వస్తోందని అంటున్నారు. ఇలా రెండు పార్టీల్లోనూ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయాలపై కొద్ది నెలల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?