Amaravati : ఇటివలి మున్సిపల్ ఎన్నికల అనంతరం మంత్రి కొడాలి నాని మీడియా కాన్ఫరెన్సులో అమరావతిపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘ఇకనైనా అమరావతి రైతులు ఉద్యమాలు మానేసి నేరుగా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపితే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుంటారు.
మీకు కావాల్సింది ఏదో అడగండి. అమరావతిని రాజధానిగా పూర్తిగా ఇక్కడి నుంచి తరలించేస్తామని చెప్పలేదు. టీడీపీ మాయ మాటల నుంచి బైటకు రండి’ అన్నారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో విశాఖపట్నం, మరీ ముఖ్యంగా విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు కూడా వైసీపీ వశం కావడం ఆ పార్టీకి మరింత మనోబలాన్ని ఇచ్చింది. తిరుగులేని ఈ విజయమే మంత్రి వ్యాఖ్యలకు కారణమైంది.
విజయం సాధించిన సందర్భంలో మంత్రిగా ఈ వ్యాఖ్యలు చేయడంలో విడ్డూరమేమీ లేదు. ఇప్పటికి 445 రోజులుగా అమరావతి ప్రాంతంలో దీక్షలు చేస్తున్నారు రైతులు. ఉద్యమం అక్కడికే పరిమితం అయింది. రాజధానిగా అమరావతిని ప్రజల కోసమే కట్టానని చెప్తున్న చంద్రబాబు ఈ ఉద్యమాన్ని విజయవాడ దాటించలేకపోయారు.
అప్పుడప్పుడూ ప్రకటనలు చేయడం తప్ప. స్థానికులు, పొలాలు ఇచ్చిన రైతులు మాత్రమే అంత కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో కూడా భౌతిక దూరం పాటిస్తూ ఉద్యమాన్ని కొనసాగించారు. దాదాపు ఏడాదిన్నరగా అటుగా వెళ్తున్న సీఎం వైఎస్ జగన్ పై నినాదాలు చేయడం మినహా ఏమీ జరగలేదు. ఇప్పుడు ఎన్నికల్లో విజయం వైసీపీకి మళ్లీ ఆ ప్రాంతం నుంచే మద్దతు లభించినట్టైంది.
ఈ నేపథ్యంలో రైతులు ప్రభుత్వంతో సంప్రదించడమే మేలు.. అనే వాదనలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి ప్రాంతంలో మంత్రి బొత్స ఒకసారి పర్యటన మినహా పెద్దగా ప్రాధాన్యం ఇచ్చింది లేదు. ఇటివలే అమరావతిలోని రోడ్లు, నిర్మాణంలో అసంపూర్తిగా ఉన్న భవనాలకు 3వేల కోట్లు కేటాయించి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో రైతులు ఉద్యమాలు చేస్తున్నారు.. రోజులు గడుస్తున్నాయి. రైతులు భూములిచ్చిన మాట వాస్తవమే కాబట్టి.. వారి ఆందోళన అర్ధం చేసుకోదగినదే. అయితే.. హైకోర్టు పరిధిలో ఉన్న ఈ అంశంపై ఎవరూ నిర్ణయం తీసుకోలేరు.. ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేరనేది కూడా గమనించాల్సిందే.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?