YS Sharmila: హైదరాబాద్ ఘటనల అనంతరం వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఒక్కసారిగా వార్తల్లో నేతగా మారిపోయారు. పార్టీ పెట్టినప్పుడు కాస్త బజ్ తప్ప ఆమె వేల కిలోమీటర్ల పొడవున పాదయాత్ర సాగిస్తున్నా పెద్దగా మీడియా కవరేజ్ రాలేదు. తెలంగాణలో వైయస్ షర్మిల ప్రభావం నామమాత్రమే అన్న కథనాలు కూడా వచ్చాయి. అయితే హైదరాబాదులో ఆమె అరెస్టు, పోలీస్ స్టేషన్లో ఏడు గంటలు నిర్బంధం తదితర పరిణామాలతో షర్మిల కు కొత్త ఇమేజ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె ఇంటర్వ్యూల కోసం ఇప్పుడు మీడియా పరుగులు పెడుతోంది. అలా ఒక ప్రముఖ మీడియా సంస్థ చేసిన ఇంటర్వ్యూలో షర్మిల పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ప్రత్యర్థులపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు.ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా కూడా మారాయి.
నేనిప్పుడు కూడా ఒంటరే.. పర్వాలేదు!
పార్టీ పెట్టినప్పటి నుంచి తన సోదరుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో షర్మిలకు సంబంధాలు లేవన్నది జగద్విఖ్యాతమే. ఇదే విషయాన్ని మరోసారి ఈ ఇంటర్వ్యూలో షర్మిల స్పష్టంగానే చెప్పారు. హైదరాబాద్ ఘటనల సమయంలో హైదరాబాదులోనే ఉండే రాజశేఖర్ రెడ్డి ఆత్మ గా పేరు ఉన్న కేవీపీ రామచందర్రావు, ఇతర కుటుంబ సభ్యులు అండగా నిలవకపోవడం గురించి ఇంటర్వ్యూ చేస్తున్న విలేకరి ప్రశ్నించగా ” నా అనుకున్న వారెవరు నాతో లేరు” అని షర్మిల రెండుసార్లు నొక్కి సమాధానమిచ్చారు. ‘పరవాలేదు ఒంటరిగానే ప్రయాణించి గమ్యం చేరుకుంటాను’అని కూడా ఆమె వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి జగన్ కు ఆమెకు మధ్య ఇంకా దూరం ఏ మాత్రం తగ్గలేదని తేటతెల్లమైంది.
YS Sharmila: చంద్రబాబు కంటే కేసీఆర్ దుర్మార్గుడు!
హైదరాబాదులో ఇంత జరుగుతున్నా మీ క్యాడర్ ఎక్కడా కనిపించలేదని, లోటస్ పాండ్ కూడా బోసిపోవడానికి కారణం ఏమనుకుంటున్నారని విలేకరి ప్రశ్నించగా షర్మిల ” చంద్రబాబు నాయుడు కన్నా కేసీఆర్ దుర్మార్గుడని అర్థమైంది అని” జవాబు ఇచ్చారు. అదేమిటని విలేఖరి మళ్లీ ప్రశ్నిస్తే ఆరోజున అధికారం లో ఉన్న చంద్రబాబు ప్రతిపక్షాలను వాటి పని వాటిని చేసుకోనిచ్చాడని, తెలంగాణలో ఇప్పుడు కెసిఆర్ ఉక్కు పాదం మోపుతున్నారని షర్మిల వివరించారు.
కెసిఆర్ కు రోజులు దగ్గరపడ్డాయి
అయితే తన పాదయాత్రే కెసిఆర్ కు అంతిమయాత్ర అని కూడా ఆమె ధీమాగా చెప్పారు.ఇందుకు ఏం చేయాలో అది అంతా తాను చేస్తానన్నారు. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ తనతో టచ్ లో ఉన్నాయని, రేపు ఏమైనా జరగవచ్చు అని కూడా షర్మిల ఓ ప్రశ్నకు బదులిచ్చారు.తన మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి, బాల్క సుమన్ తదితరులకు షర్మిల తనదైన శైలిలో వార్నింగ్ కూడా ఇచ్చారు. మొత్తంగా చూస్తే షర్మిల లో కొత్త జోష్ కనిపిస్తోంది.
YS Sharmila: వైఎస్ షర్మిలకు అపాయింట్మెంట్ ఇచ్చిన గవర్నర్ తమిళిసై ..రేపు రాజ్ భవన్ లో భేటీ