వెనకటికి సత్యహరిశ్చంద్రుడు అప్పుల బాధ నుంచి తప్పించుకోడానికి భార్యనే అమ్మకానికి పెట్టాడు. కాశీపట్నం నడివీధిలో సతీమణి చంద్రమతిని నిలబెట్టి, కాశీపుర పౌరులారా భాగ్యవంతులారా ఈమె నా భార్య అని మనవి చేసుకున్నాడు. జవదాటి ఎరుగదు సుదతీలలామ పతిమాట అంటూ ఆమె గుణగణాలను వర్ణిస్తాడు. నాటకంలో ఆ సీను చూసినప్పుడు కన్నీరు పెట్టని ప్రేక్షకుడు వుండడు. అదేమో కాని నాకు కమ్యూనిస్టులు టెన్ టీవీ అమ్మకానికి పెట్టారంటే అంతే దు:ఖం కలిగింది. అందునా ఏ కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలంటే మనకూ ఓ ప్రచండమైన ఆయుధంగా ఛానెల్ కావాలని మార్క్సిస్టు మిత్రులు ఉద్ఘోషించారో అదే కార్పొరేట్ విపణి వీధిలో నిలబడి..టెన్ టీవీని అమ్మకానికి పెట్టి కార్పొరేట్ బాసులారా.. అంటూ తమ ఛానల్ గుణగణాలను ఏకరువు పెట్టి ఎకాఎకిన అమ్మిపారేశారు. ఇక్కడ మార్క్సిస్టుల్ని సత్యహరిశ్చంద్రునితో పోల్చడం నా ఉద్దేశం కాదు, టెన్ టీవీ చంద్రమతీ కాదు. కానీ బాధగా వుంది. బాధే సౌఖ్యమనే భావన రావడం లేదు. బాధగా వుందని చెప్పాలంటే ఇంకా బాధగా వుంది.
టెన్ టీవీ పునాదుల నుండి సౌధ నిర్మాణం దాకా ఇటుక ఇటుకునా అడుగు అడుగునా అరుణ్ సాగర్..నేనూ..నాలాంటి ఎందరో మిత్రులం వున్నాం. పది లక్ష్యాలతో పది రేకుల పువ్వుగా వికసించిన టెన్ టీవీ గురించి పద్యాలు కూడా రాశాను. అందుకే బాధ. కనీసం హరిశ్చంద్రుడు ధర్మపత్నిని పౌరులందరి సమక్షంలో అమ్మకానికి పెట్టాడు. కానీ టెన్ టీవీ వాటాదారులైన లక్షల మంది షేర్ హోల్డర్లకు సూచనప్రాయంగానైనా వార్త అందకుండా అమ్మకాలు జరిగిపోయాయని తెలిసినందుకు బాధగా వుంది. మన గళం వినిపించడానికి మన బాధలు మన గాథలు దృశ్యాలుగా చూపించడానికి ఒక టీవీ వస్తున్నందుకు మురిసిపోయి పుస్తెలు కూడా తాకట్టు పెట్టి టీవీలో షేర్లు కొన్న సామాన్యులున్నారట. లాభాలు వస్తాయన్న ఆశ ఎవరికీ లేదు. కనీసం సామాన్యుల గుండె చప్పుడుగా ఒక టీవీ నిలుస్తుందని వారు ఆశించారు. వారికి కూడా మాట మాత్రమైనా చెప్పలేదన్న వార్త చదివినందుకు బాధగా వుంది.
అంత దొంగచాటుగా ఛానల్ ని అమ్ముకోవలసిన అగత్యం మార్క్సిస్టులకు ఎందుకు పట్టిందని ఆలోచన కలిగినందుకు బాధగా వుంది. మార్కెటింగ్ బాగుంది..ఆదాయం బాగుంది..రేటింగ్ బావుంది..వ్యూవర్స్ లో మంచి టాక్ బావుంది. అన్నీ బాగున్నా మరి టెన్ టీవీ నోట్లోకి ఈ శని ఎట్లా దాపురించిందా అనుకుంటేనే బాధగా వుంది. అసహాయుల కోసం టీవీ కావాలని అహోరాత్రాలు కష్టపడి కోట్లు కూడగట్టిన ప్రజాసేవకులు ఇంత అసహాయులు ఎందుకయ్యారా అన్న ప్రశ్న తలెత్తినందుకు బాధగా వుంది. ప్లాట్లు కొన్నారని రియలెస్టేట్ దందా చేశారని వార్త చదివితే నేనింతగా అభిమానించే నాయకులకు ఎన్ని పాట్లొచ్చాయిరా భగవంతుడా అని మొత్తుకోవాల్సిన స్థితి దాపురించినందుకు బాధగా వుంది. ఏమైనా కార్పొరేటు బాసులకు కమ్యూనిస్టు బాసులు ఇలా సాగిలపడి రావాల్సిన విషాద సందర్భం చూడాల్సి రావడమే ఒక విషాదమని చెప్పడానికి బాధగా వుంది.
తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరని మాటిమాటికీ ప్రశ్నించిన వారే టెన్ టీవీ నిర్మాణానికి విరాళాలెత్తిన కూలీలను మర్చిపోయారా? ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయీలెవ్వరని పదే పదే ప్రశ్నించిన వారే టెన్ టీవీ పల్లకి ఎక్కడానికి మోజుపడిన దొరల కోసం దాన్ని మోసిన బోయీలను విస్మరించారా? ఇదంతా ఏమిటో వింత వింతగా వుందని చెప్పడానికే బాధగా వుంది. నిప్పులాంటి వ్యక్తులు వార్తల వంటకాల్లో ఉప్పుకణికల్లా మారిపోవడం ఏమిటో అయోమయంగా వున్నందుకు బాధగా వుంది. అయ్యో మళ్ళీ నాకు హరిశ్చంద్రుడే గుర్తుకొస్తున్నాడు. ఎండపొడ తెలియని మణిమయ సౌధాలలో నివసించిన సతీలలామ తన వెంట బాధలు పడుతున్నప్పుడు హరిశ్చంద్రుడు ఇలా పద్యమందుకుంటాడు. ఏనాడు నడచినావు ఈ ఎడారులలోన..సలలిత ఆరామ సీమలనె గాని..ఏనాడు పొడజూపితీ ప్రచండపుటెండ..అలఘు మాణిక్య కాంతులకె గాని..ఇప్పుడు నా మార్క్సిస్టు సోదరుల్ని చూసి ఇలా పాడుకోవాలనుంది.
ఏనాడు నిలిచినారు ఈ బిడారులలోన..అరుణ కాంతుల పోరు బాటలనె గాని..ఏనాడు పొడజూస్తిరీ ప్రచండపు వార్త..నిత్య సంకీర్తనా భజనలకె గాని..
అకటా కటకటా కవీ..నీ కాలమ్ కోసం మా భావజాలంనే దుయ్యబడతావా అని నా మీద దండెత్తుతారా? లేదు లేదు మిత్రులారా. ఇది మిత్ర వైరుధ్యమే కాని శత్రు వైరుధ్యం ఎంత మాత్రం కాదు సుమా. నాకు తెలుసు. ప్రజల కోసం..ప్రజల చేత..ప్రజలు నాయకులుగా నడిపించాలనుకుని అది సాధ్యం కాకనే ఇంత అసహాయంగా టీవీని అమ్ముకోవలసి వచ్చిందని మీరు దు:ఖిస్తున్నారని నాకు తెలిసినందుకే ఈ బాధ
–ప్రసాదమూర్తి