Telangana Election 2023: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరో కీలక హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం అర్మూర్ నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ష్ షా పాల్గొన్నారు. బతుకు తెరువు కోసం వేరే దేశాలకు వెళ్లే భారతీయులకు బీజేపీ అండగా నిలుస్తుందని ఆయన అన్నారు. జీవనో పాధి వెతుక్కుంటూ ఇతర దేశాలకు వెళ్లే వలస కార్మికులకు ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తామని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రత్యేకంగా ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.
ఈ ప్రాంతంలో ఉపాధి వెతుక్కుంటూ గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారు చాలా మంది ఉన్నారని, సరైన ఉపాధి దొరక్క ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించేందుకు కృషి చేస్తామని తెలిపారు. వారి సంక్షేమానికి కృషి చేసేలా ప్రత్యేక ఎన్ఆర్ఐ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే బీసీ ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించామని, అలానే దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెదతామని చెప్పారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుటుంబ పాలనకు ప్రాధాన్యత ఇస్తున్నాయని ఆరోపించారు అమిత్ షా. రాష్ట్రంలో దశాబ్దాలుగా పాలన సాగించిన రెండు పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయాయని అన్నారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే అవినీతి పరులను జైలుకు పంపుతామన్నారు అమిత్ షా. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సీఎం కేసిఆర్ పూర్తిగా విఫమైయ్యారని అన్నారు. బీడీ కార్మికుల ప్రయోజనాల కోసం కృషి చేస్తామని చెప్పారు. నేషనల్ టర్మరిక్ బోర్డు, పరిశోధనా కేంద్రం, 500 పడగల ఆసుపత్రి ఏర్పటునకు ప్రధాని మోడీ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. బాయిల్డ్ రైస్ కు కనీస మద్దతు ధర ఇస్తామని చెప్పారు.
రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు అమిత్ షా. తదుపరి చౌటప్పల్ లో నిర్వహించిన రోడ్ షోలో అమిత్ షా పాల్గొన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే కేసిఆర్ కు ఓటు వేసినట్లైననీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు అమ్ముడుపోతారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ సర్కార్ ఏర్పాటు కావడం ఖాయమన్నారు. అవినీతిలో కూరుకుపోయిన బీఆర్ఎస్ సర్కార్ ను ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని అన్నారు అమిత్ షా.
Telangana Election 2023: ఎన్నికల వేళ తెలంగాణలో కీలక పరిణామాలు .. కాంగ్రెస్ గూటికి మరో కీలక నేత