Amit Shah: ఎన్నికల సమయంలో ప్రజలను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు అనేక ప్రజాకర్షక పథకాలను ప్రకటించడంతో పాటు పలు హామీలను గుప్పిస్తుంటారు. కులాల వారీగా ఆకట్టుకునేందుకు హామీలు ఇస్తుంటారు. గతంలో కేసిఆర్ ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత రెండు సార్లు ముఖ్యమంత్రిగా కేసిఆర్ యే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సారి అధికారంలోకి వస్తే కేటిఆర్ ను ముఖ్యమంత్రి చేయాలని కేసిఆర్ భావిస్తున్నారు. ఇదే అంశాన్ని బీజేపీ అస్త్రం గా చేసుకుని విమర్శిస్తూ ఇవేళ కీలక ప్రకటన చేసింది. బీజేపీ బీసీ కార్డు ఉపయోగించింది.
బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించారు ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. సూర్యపేటలో శుక్రవారం జరిగిన బీజేపీ జన గర్జన సభలో అమిత్ షా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం కేంద్రంలోని బీజేపీ పని చేస్తొందని అన్నారు. కేటిఆర్ ను సీఎం చేయాలని కేసిఆర్ అనుకుంటున్నారనీ, రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని సోనియా గాంధీ చూస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పేదలు, దళితుల, బీసీల వ్యతిరేక పార్టీలు, కుటుంబ పార్టీలని, తెలంగాణను అభివృద్ధి చేయలేవు అని అన్నారు. దళితులను సీఎం చేస్తామని కేసిఆర్ అధికారంలోకి వచ్చారనీ, ఇప్పటికైనా దళితుడ్ని సీఎం చేస్తావా అని కేసిఆర్ ను ప్రశ్నించారు అమిత్ షా.
దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామన్న హామీ ఏమైంది. బీసీల సంక్షేమానికి ఏటా పదివేల కోట్లు కేటాయిస్తామని అన్నారు ఆ నిధులు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలు కుటుంబ సభ్యుల కోసమే పని చేసే పార్టీలని అన్నారు. తెలంగాణలో పసుపు రైతుల కోసం జాతీయ పసుపు బోర్డును కూడా ఏర్పాటు చేస్తామని, సమ్మక్క సారక గిరిజన యూనివర్శిటీని మంజూరు చేశామని తెలిపారు. తెలంగాణకు కేసిఆర్ చేసింది ఏమీ లేదని విమర్శిస్తూ తెలంగాణ అబివృద్ధికి అన్ని విధాలా కట్టుబడి ఉన్నామని తెలిపారు.
ఇదే క్రమంలో హిందువుల ఓట్లు ఆకట్టుకునేందుకు ఆయోధ్య రామాలయం ప్రస్తావన తీసుకువచ్చారు అమిత్ షా. 550 ఏళ్ల పోరాటం అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగాలా వద్దా అని ప్రశ్నించారు. జనవరి 22న ప్రధాని మోడీ రామమందిరంలో పూజల చేయబోతున్నారని చెప్పారు. జనవరి చివరి వారంలో మీరందరూ అయోధ్య రావాలని కోరారు. ప్రధాని మోదీ అన్ని వర్గాల వారికి సమ న్యాయం చేస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు అవుతున్న పథకాలను అమిత్ షా వివరించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
Telangana: తెలంగాణ ఎన్నికల సమయం లో పార్టీలు మార్చిన రాజకీయ నేతలు వీరే!