IPS RS Praveen Kumar: తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక కాక నడుస్తున్న వేళ సీనియర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాలంటరీ రిటైర్మెంట్ కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాయడం తీవ్ర సంచలనం అవుతోంది. పదవీ విరమణ తర్వాత కొత్త ప్రపంచంలోకి అడుగుపెడతాననీ, స్వేచ్చ, సమానత్వం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించడంతో ఇక ఆయన అడుగులు రాజకీయాలపై ఉంటాయనే ఊహాగానాలు వచ్చేస్తున్నాయి. హూజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ ఓటమికి బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని చూస్తున్న టీఆర్ఎస్..ప్రవీణ్ కుమార్ ను నిలిపేందుకు తెరవెనుక ప్రయత్నాలు నడిపి ఉండవచ్చనే వార్తలు వస్తున్నాయి.
హూజూరాబాద్ నుండి ఈటలకు పోటీగా ధీటైన అభ్యర్థిని నిలిపేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. తొలుత టీడీపీ నుండి టీఆర్ఎస్ లో చేరిన బీసీ వర్గానికి చెందిన ఎల్ రమణను ఈటలకు పోటీగా నిలిపే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆయితే ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిని తానే అనే ప్రచారం చేసుకున్న ఆడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ప్రధానంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ ఓట్లు ఎక్కువ. ఈ వర్గాల నుండి అభ్యర్థి అయితేనే గట్టి పోటీ ఉంటుంది. దళిత వర్గాల ఓట్లు ప్రభావం చూపించే స్థాయిలో ఉండటంతో ముందుగా మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేరు వచ్చింది. అయితే సోమవారం అనూహ్యంగా సీనియర్ ఐపీఎస్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకోవడంతో టీఆర్ఎస్ అభ్యర్థి అయనే అవుతారనే ప్రచారం జరుగుతోంది.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అలంపూర్ కు చెందిన ప్రవీణ్ కుమార్ 1995 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 2002 నుండి 2004 వరకూ కరీంనగర్ జిల్లా ఎస్పీగా పని చేశారు. ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్న అధికారిగా పేరు ఉంది. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరున్న ప్రవీణ్ కుమార్ గ్రేహాండ్స్ ఐజీగా మూడేళ్లు పని చేశారు. ఆయన హయాంలో సంచలన ఎన్ కౌంటర్ లు చేశారు. 2012 నుండి స్వేరోస్ అనే ఓ స్వచ్చంద సంస్థ ద్వారానూ సేవలు అందిస్తున్నారు. 2013 నుండి తెలంగాణ గురుకుల పాఠశాలల కార్యదర్శిగా పని చేస్తున్నారు. గురుకులాల కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రవీణ్ కుమార్ ఎన్నో సంచలనాలు నమోదు చేశారు. గురుకుల పాఠశాలకు మంచి గుర్తింపు తీసుకువచ్చారు. గురుకుల పాఠశాల విద్యార్థులకు మెరుగైన విద్య, మంచి భోజనం, పర్వతరోహణలో శిక్షణ, క్రికెట్, వాలీబాల్, పుట్ బాల్ లాంటి క్రీడల్లో శిక్షణ లాంటి విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు.
ఉమ్మడి కరీంనగర్ ఎస్పీగా పని చేసిన సమయంలో హుజురాబాద్ తో పాటు కమలాపూర్, భీమదేవరపల్లి, హుస్నాబాద్ ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టడంతో ఇప్పటికీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ ప్రాంతాల్లో కొంత ఆదరణ ఉంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకునే ప్రవీణ్ కుమార్ ను ఉప ఎన్నికలో పోటీకి దింపాలని కేసిఆర్ ఆలోచన చేసి ఉంటారనీ, అందుకే ఆయన ఈ అనూహ్య నిర్ణయాన్ని ఇప్పుడు తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇవన్నీ ఊహాగానాలేనా వీటిలో ఏమైనా వాస్తవం ఉందా అనేది తేలాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.