ముఖ్యమంత్రి కేసిఆర్ ఆధ్యక్షతన ఈ రోజు కేబినెట్ భేటీ జరగనుంది. ప్రగతి భవన్ లో మధ్యాహ్నం 2 గంటల నుండి జరిగే ఈ మంత్రివర్గ సమావేశంలో అజెండాలోని 15 కీలక అంశాలతో పాటు వివిధ ప్రదాన సమస్యలపైనా చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 6వ తేదీ నుండి శాసన సభ సమావేశాలు నిర్వహించతలపెట్టిన నేపథ్యంలో ఈ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహం, సంబంధిత అంశాలపై చర్చించనున్నారు. విపక్షాలను ధీటుగా ఎదుర్కొనే విషయంపై మంత్రులకు సీఎం కేసిఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై కూడా చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి నిధులు, విద్యుత్ బకాయిల విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో మంత్రివర్గంలో ఈ విషయంపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. ఆగస్టు 15 నుండి 57 ఏళ్లు నిండిన వారికి కూడా ఫించన్లు ఇస్తున్నారు. అయితే ఫించన్ల సంఖ్య ను మరింత పెంచే అవకాశంపైనా సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తొంది.
ఈ నెల 25వ తేదీ నుండి బతుకమ్మ పండగ జరగనున్న నేపథ్యంలో ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా కోటి 33 లక్షల మంది మహిళలకు చీరెలను ఉచితంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తొంది. ఈ చీరల పంపిణీ తేదీలపై సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదే విధంగా రాష్ట్రంలో పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపాలని కేంద్రానికి ఇటీవల ప్రభుత్వం లేఖ రాసింది. కానీ అక్కడ నుండి ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో కేంద్రంతో సంబంధం లేకుండా పోడు రైతులకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వమే ఏదైనా చర్యలు తీసుకోవచ్చా అనే దానిపైనా కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధంచి 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అలానే తెలంగాణ వజ్రోత్సవాలు నిర్వహించాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తొంది. సెప్టెంబర్ 17వ తేదీ నాటికి భారత్ లో తెలంగాణ విలీనమై 74 ఏళ్లు పూర్తి అయి 75వ వసంతంలోకి అడుగు పెడుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ చరిత్ర. సంస్కృతిని భావితరాలకు చాటిచెప్పేలా కార్యక్రమాల నిర్వహణపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. వజ్రోత్సవాల పై విధి విధానాలు ఖరారు చేసే అవకాశం ఉంది.
వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కేబినెట్ ర్యాంక్ తో కీలక పదవి
మరో కీలక అంశం ఏమిటంటే .. సీబీఐ, ఈడీ వంటి స్వతంత్ర సంస్తలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తొందని ఇటీవల బీహార్ పర్యటనకు వెళ్లిన సందర్భంలో సీఎం కేసిఆర్ తీవ్ర విమర్శలు చేశారు. సీబీఐకి రాష్ట్రంలో అనుమతి ఉపసంహరణపై బీహార్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించిన కేసిఆర్ .. ఇతర రాష్ట్రాల్లోనూ ఇటువంటి నిర్ణయాన్నే తీసుకోవాలని కేసిఆర్ పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలో సీబీఐకి రాష్ట్రంలో అనుమతి నిరాకరిస్తూ కేసిఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. ఈ కేబినెట్ భేటీలో ఈ అంశంపైనా చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. వీటితో పాటు ఉద్యోగ నోటిఫికేషన్ల జారీలో పురోగతి, ధరణి సమస్యలు, ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలు, వాయిదా పడిన రెవెన్యూ సదస్సుల నిర్వహణ, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితికి సంబంధించిన అంశాలపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. అనంతరం సీఎం కేసిఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.
తెలంగాణ సీఎం కేసిఆర్ పై ప్రశంసల వర్షం కురిపించిన బీహార్ సీఎం నితీశ్ కుమార్