తెలంగాణలో సీఎం కేసిఆర్ పాలనా తీరుపై వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శించారు. కోటి ఎకరాలకు నీరు అందిస్తామన్న పేరుతో కేసిఆర్ .. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించి ఆంధ్రా కాంట్రాక్టర్లకు వేల కోట్లు దోచిపెట్టారని షర్మిల ఆరోపించారు. ఎనిమిదేళ్ల పాలనలో భద్రాచలం కరకట్ట పనులు ఎందుకు పూర్తి చేయలేకపోయారని కేసిఆర్ పై మండిపడ్డారు. ప్రజలు, వర్షాల్లో మునిగి నష్టపోతే కట్టమీద నిలబడి క్లౌడ్ బరస్ట్, పోలవరం ప్రాజెక్టు వల్లే నష్టం అంటూ పిట్టకధలు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారని సీఎం కేసిఆర్ ను విమర్శించారు. వరద ప్రాంతాల్లో తాను పాదయాత్ర చేపట్టి ప్రజల సమస్యలు తెలుసుకుంటాననీ, కేసిఆర్ ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తామని పేర్కొన్నారు. వరదలు వచ్చి భద్రాచలం, ములుగు ప్రాంతాలు మునిగిపోవడానికి సీఎం కేసిఆర్ అసమర్ధతే కారణమని మండిపడ్డారు షర్మిల.
నాడు ఉమ్మడి రాష్ట్రంలో సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కాంట్రాక్ట్ పనులు ఒక్క వ్యక్తికే కాకుండా అందరికీ ఇచ్చి ప్రోత్సహించి అందరివాడుగా పేరు తెచ్చుకున్నారనీ, కానీ కేసిఆర్ మాత్రం తన మనిషి అయిన మేఘా కృష్ణారెడ్డికి రాష్ట్రంలో 80 శాతం పనులు అప్పగించారని, తనకు ఏమి లాభం లేకపోతే అన్ని పనులు ఆయనకే ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు మిషన్ భగీరత, మన ఊరు మన బడి, రోడ్ల పనులు, ఆర్ టీ సీ పనులు అనీ ఒకే వ్యక్తి మేఘా కృష్ణారెడ్డికి ఎందుకు కట్టబెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందులో కేసిఆర్ కుటుంబానికి వాటా ఉందని షర్మిల ఆరోపించారు. వీటిని ప్రశ్నించాల్సిన కాాంగ్రెస్, బీజేపీ కూడా నోరు మెదపడం లేదని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకముందు ఎలాంటి సమస్యలు లేవని కట్టిన తర్వాతే ఎందుకు వస్తున్నాయని షర్మిల ప్రశ్నించారు. కాళేశ్వరంలో ఎంత నష్టం జరిగిందో ప్రభుత్వం దాచాలనుకున్నా అందరికీ తెలిసిపోయిందన్నారు. కాళేశ్వరం కట్టిన పాపానికి వేల ఎకరాలు మునిగిపోయాయనీ, రైతులకు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కడెం ప్రాజెక్టు గేట్లు మార్చాలన్న డిమాండ్లను సీఎం కేసిఆర్ పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ప్రాజెక్టు గేట్లు పని చేయకపోవడం వల్లే ఇంత పెద్ద వరద వచ్చిందని అన్నారు షర్మిల. 33 మంది సిబ్బంది ఉండాల్సిన కడెం ప్రాజెక్టు దగ్గర ముగ్గురే ఉన్నారని అన్నారు. వరదల్లో గూడు కోల్పోయిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టివ్వాలని షర్మిల డిమాండ్ చేశారు.