YS Sharmila: తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలపై సంఘటిత ఉద్యమం చేపట్టేందుకు వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మరో సారి ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో ఫోన్ లో మాట్లాడిన వైఎస్ షర్మిల .. ప్రతిపక్ష పార్టీ ఐక్య ఉద్యమంపై ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జెండాలు వేరైనా ఒకే అజెండాగా ఏకమైన పార్టీలు.. నేడు స్వరాష్ట్రంలో నిరుద్యోగ యువత కోసం మళ్లీ ఏకం కావాల్సిన అవసరం ఏర్పడినదన్నారు. 1200 మంది ఆత్మ బలిదానాల మీద ఏర్పడిన తెలంగాణలో నిరుద్యోగులకు అన్యాయమే జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
బిస్వాల్ కమిటీ 1.91 లక్షల ఖాళీలు ఉన్నాయని తేల్చి చెబితే, సీఎం కేసిఆర్ మాత్రం 80 వేల ఖాళీలు మాత్రమే ఉన్నాయని ప్రకటించారన్నారు. అవి కూడా భర్తీ చేయడానికి చేతకావడం లేదన్నారు. ఇచ్చిన నోటిఫికేషన్లలో ఎన్ని పేపర్లు లీక్ అయ్యాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. టీఎస్ పీఎస్ సీ నేడు అది ప్రశ్నాపత్రాలు అమ్మే సంస్థగా తేలిందని విమర్శించారు. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను బలి చేస్తూ.. ఉద్యోగాలను సంతలో సరుకుల్లా అమ్ముకొంటున్నారని అన్నారు. దీనికి బాధ్యత వహించాల్సిన సర్కారు.. తప్పు నాది కాదు అని మన్ను తిన్న పాము లాగా తప్పించుకుంటున్నదన్నారు.
నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే ప్రతిపక్షాలంతా ఏకతాటి మీదకు రావాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు షర్మిల. సర్కారుపై నిరుద్యోగ సైరన్ మోగించాల్సిన సమయం ఆసన్నం అయినదని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ, తెలంగాణ జన సమితి, బీఎస్పీ, టీడీపీ, జనసేన, ఎంఐఎం, సీపీఐ, సీపీఎం, ఎంఆర్ పీఎస్ తో పాటు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు మాతో కలిసి రావాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అభ్యర్థిస్తున్నదని అన్నారు షర్మిల. అందరం పార్టీలకు అతీతంగా నిరుద్యోగుల పక్షాన పోరాడుదామని పిలుపునిచ్చారు.
వైఎస్ షర్మిల విజ్ఞప్తి బాగానే ఉంది కానీ ఎంఐఎం, వామపక్షాలు కేసిఆర్ సర్కార్ కు అనుకూల పక్షాలుగా ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒకే వేదికకు పంచుకునే వచ్చే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో షర్మిల పిలుపునకు ఏయే రాజకీయ పక్షాలు స్పందిస్తాయో వేచి చూడాలి.
YS Jagan: ఈ నెల 6న చిలకలూరిపేటలో సీఎం జగన్ పర్యటన