YS Sharmila: ఎన్నో ఆశలతో తెలంగాణ రాజకీయ పార్టీ పెట్టిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేయాలని నిర్ణయానికి వచ్చినా ఆ విషయాన్ని బహిర్గతం చేయలేని పరిస్థితిలో ఉంది. తాను ఒకటి తలిస్తే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరొకటి తలుస్తుండటంతో ఏమి చేయాలో పాలుపోని పరిస్థితిలో షర్మిల ఉన్నారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షర్మిల ను ఢిల్లీ చుట్టూ తిప్పుకుంటోంది కానీ తుది నిర్ణయం వెల్లడించడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ షర్మిల రెండు మూడు పర్యాయాలు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో భేటీ అయిన సమయంలో ఆమె వెంట తెలంగాణ నేతలు గానీ, ఏపీ నాయకులు గానీ లేరు. షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనానికి సంబంధించి మూడు నెలలుగా వార్తలు వస్తున్నా ఇంత వరకూ ఒక కొలిక్కి రాలేదు. షర్మిల ప్రతిపాదనలకు కాంగ్రెస్ హైకమాండ్ పూర్తి స్థాయిలో సమ్మతించకపోవడం వల్లనే సమస్యగా మారిందన్న చర్చ జరుగుతోంది. ఈ కారణంగానే అటు పార్టీ అధిష్టానం గానీ, ఇటు షర్మిల గానీ ఇంత వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదని సమాచారం.
వాస్తవానికి తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపనే ధ్యేయంగా రాజకీయ పార్టీని షర్మిల ప్రారంభించగా, తాను ఆశించిన స్థాయిలో ఆదరణ లభించకపోవడంతో తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు సిద్దమైయ్యారు వైఎస్ షర్మిల. ఇందు కోసం వైఎస్ షర్మిల కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న కర్ణాటక పీసీసీ చీఫ్, అక్కడి డిప్యూటి సీఎం డీకే శివకుమార్ మద్యవర్తిత్వం నడిపిన సంగతి తెలిసిందే. అయితే పార్టీ అధిష్టానం నుండి మాత్రం షర్మిలకు ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని సమాచారం. తన పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సిద్దమైన వైఎస్ షర్మిల పార్టీ అధిష్టానం వద్ద పలు డిమాండ్ లు పెట్టినట్లు సమాచారం. అందులో ప్రధానంగా పాలేరు సీటు తనకు కేటాయించడంతో పాటు తాను సూచించిన అభ్యర్ధులకు కొన్ని టికెట్లు ఇవ్వాలని. అంతే కాకుండా తాను తెలంగాణ రాజకీయాలకే పరిమితం అవుతానని. అయితే టీపీసీసీలో ఈ ప్రతిపాదన నుండి విముఖత వ్యక్తం అవుతోంది.
తెలంగాణలో నాయకత్వానికి ఎటువంటి సమస్య లేదు. అనేక మంది సీనియర్ నేతలు ఉన్నారు. ప్రస్తుతం ఏపీలోనే కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ సమస్య ఉంది. అందుకే షర్మిల సేవలను ఏపీలో వినియోగించుకోవాలని తెలంగాణ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారుట. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యతిరేకులు మాత్రం షర్మిల తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోకి రావడానికి ఆహ్వానిస్తున్నారు. అయితే షర్మిల పార్టీలోకి వస్తే తెలంగాణ కాంగ్రెస్ లో ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా షర్మిల సేవలను ఏపీకే పరిమితం చేసేందుకు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. ముందుగా తెలంగాణ ఎన్నికల వరకూ ప్రచార కార్యక్రమంలో షర్మిల సేవలను వినియోగించుకుని ఆ తర్వాత ఏపీ బాధ్యతలు అప్పగించాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నదని సమాచారం.
మరో పక్క షర్మిల కోరుతున్న పాలేరు టికెట్ కు కాంగ్రెస్ పార్టీలో డిమాండ్ ఉంది. తాజాగా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న సినీయర్ నేత తుమ్మల నాగేశ్వరరావు పాలేరు టికెట్ నే అడుగుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రత్యేక వర్గం ఉన్న తుమ్మలకు పాలేరు టికెట్ ఇవ్వడానికి ఇప్పటికే కాంగ్రెస్ సిద్దమైందని వార్తలు వినబడుతున్నాయి. రీసెంట్ గా భర్త బ్రదర్ అనిల్ తో కలిసి సోనియా, రాహుల్ గాంధీలతో షర్మిల భేటీ అయినప్పటికీ ఇండియా కూటమి సమావేశానికి వెళ్లేందుకు వారు సిద్దమైనందున ఎక్కువ సేవు చర్చలకు అవకాశం లభించలేదని అంటున్నారు. మరో సారి పూర్తి స్థాయి చర్చలు జరిగిన తర్వాతనే షర్మిల పార్టీ విలీనంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. షర్మిల డిమాండ్ లను కాంగ్రెస్ ఒప్పుకుంటుందా .. లేక కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్లుగా షర్మిల ఒకే అంటారా అనే విషయాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.